ఒకట్రెండు రోజులు జైల్లో ఉండడానికి చంద్రబాబు లబోదిబోమంటున్నారు. బెయిల్ కోసం ఎన్నెన్నో సర్కస్ ఫీట్స్. అత్యంత ఖరీదైన లాయర్లను పెట్టుకుని జైలు నుంచి త్వరగా బయట పడేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు రెండు రోజులు నిద్ర చేశారు.
కేసులు పెట్టించడం, జైలుకు పంపడం మాత్రమే తనకు తెలుసని, అలాంటిది తనపైనే అలాంటివి ఏంటని చంద్రబాబు ప్రశ్న. ఎవరిపై అయినా అవినీతి ముద్ర, నేరస్తుల ముద్ర వేయగలిగే శక్తిసామర్థ్యాలు తన సొంతమని ఇంతకాలం నమ్మిన చంద్రబాబు, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏది ఏమైతేనేం చంద్రబాబుకు కూడా ఖైదీ నంబర్ వచ్చింది.
ఈ నేపథ్యంలో బాబు బెయిల్ కోసం చంద్రబాబు నియమించుకున్న ఖరీదైన సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఒత్త వాదనను తెరపైకి తెచ్చారు. తన క్లయింట్కు జైల్లో ప్రాణాపాయ ముప్ప ఉందనే అనుమానాలున్నాయని, కావున హౌస్ అరెస్ట్లో వుంచాలంటూ న్యాయస్థానంలో పోరాటం మొదలు పెట్టారు. బెయిల్ కోసం చంద్రబాబు ఎంత దిగజారాడురా నాయనా అంటూ జనాలు అంటున్న పరిస్థితి.
గతంలో వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇలా ప్రాణ భయం సాకుతో బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదని పలువురు న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు. తనపై నమోదైన కేసులు, నిబంధనల ప్రకారం బెయిల్ ఇవ్వాలని మాత్రమే జగన్ తరపు పిటిషన్లు దాఖలయ్యాయనే చర్చకు తెరలేచింది. కానీ చంద్రబాబు పటిష్టమైన భద్రత మధ్య వుంటూ… ప్రాణాలకు ముప్పు వుందని పేలవమైన వాదనను తెరపైకి తేవడంపై న్యాయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
ఒకవేళ చంద్రబాబు కోరుకుంటున్నట్టుగా రిలీఫ్ దొరక్కపోతే, రానున్న రోజుల్లో ఇంకెంత నీచమైన వాదనను వినిపించడానికి సిద్ధమవుతారో ఆలోచించడానికే భయమేస్తోందని న్యాయవాదులు అంటున్నారు. బాబు ఎంత పిరికిపందో ఆయన పక్షాన వినిపిస్తున్న బలహీనమైన వాదనలు నిదర్శనమని పలువురు అంటున్నారు.