తన తండ్రి చంద్రబాబునాయుడిని జైలుకు పంపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా పెద్ద తప్పు చేశాడని నారా లోకేశ్ భారీ డైలాగ్లు కొట్టారు. రాజమండ్రిలో మీడియా సమావేశంలో లోకేశ్ మాటలు విన్నవాళ్లు నవ్వుకోకుండా ఉండలేరు. జగన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లోకేశ్ తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించడం తప్ప, చేసిందేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు జోలికి రావడం. దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు’ అని లోకేశ్ హెచ్చరించడం చర్చనీయాంశమైంది. స్కిల్ డెవల్పమెంట్ స్కామ్లో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఇది టీడీపీకి అతిపెద్ద షాక్. అందుకే ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. జగన్పై లోకేశ్ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
అసలు నీ చరిత్ర ఏంటి జగన్ అని లోకేశ్ నిలదీశారు. నీపై 37 కేసులు ఎందుకు ఉన్నాయో ప్రజలకు చెప్పగలవా? అని సీఎం జగన్ను లోకేశ్ నిలదీశారు. ఇదే సందర్భంలో తన తండ్రి ఎంత గొప్ప నాయకుడో వివరించే ప్రయత్నం చేశారు. ప్రజలు, రాష్ట్రం, దేశం గురించి తప్ప మరే ఇతర విషయాల గురించి ఆలోచించని గొప్ప నాయకుడు చంద్రబాబునాయుడు అని చెప్పుకొచ్చారు. అసలు అవినీతి అనేది బాబు రక్తంలోనే లేదని లోకేశ్ ఆకాశమే హద్దుగా తన తండ్రి గురించి ప్రశంసించారు.
మన జోలికి ఎవరూ రాకూడదని అనుకుంటే, మనం కూడా ఎదుటి వాళ్ల విషయంలో అంతే గౌరవంగా వుండాలి. జగన్ను జైలుకు పంపడంలో చంద్రబాబు అత్యంత కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం. అంతేకాదు, ఏకంగా 16 నెలల పాటు జగన్ జైల్లో మగ్గేలా చేసిన ఘనత నాడు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఉమ్మడి ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీదే అని అందరికీ తెలుసు. జగన్పై టీడీపీ సీనియర్ నేత దివంగత ఎర్రన్నాయుడు, ప్రస్తుతం ఏ పార్టీలో లేని బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఫిర్యాదులు, కేసులు నడిపేందుకు కారకులని లోకేశ్కు తెలియదా?
జగన్ రాజకీయ జీవితాన్ని మొగ్గ దశలోనే తుంచి వేయాలని కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు కుట్రకు పాల్పడిన వైనం గురించి లోకేశ్ తెలుసుకుంటే మంచిదని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు. అప్పుడు జగన్ జైల్లో వుంటే పైశాచిక ఆనందం పొందిన వాళ్ల పాపాలు పండే రోజులొచ్చాయని, చర్యకు ప్రతిచర్య అనేది ప్రకృతి ధర్మమని, బాబు చేసిన అవినీతికి శిక్ష అనుభవించే కాలం వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు.
జగన్తో పెట్టుకుని తన తండ్రి అతిపెద్ద తప్పు చేశాడని ఇప్పటికైనా లోకేశ్ తెలుసుకుని, జాగ్రత్తగా మసలుకోవాలని వైసీపీ నేతలు స్వీట్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. జగన్పై 37 కేసులు ఎలా వచ్చాయో చెప్పాల్సింది టీడీపీ నేతలే అని వైసీపీ డిమాండ్ చేస్తోంది. జగన్పై కేసులుంటే సక్రమం అని, తమపై వుంటే మాత్రం అక్రమమని లోకేశ్ ఎలా అంటారని ప్రత్యర్థులు నిలదీస్తున్నారు.