చంద్రబాబునాయుడిని వైఎస్ జగన్ ప్రభుత్వం జైల్లో వేస్తుందని టీడీపీ నేతలు కలలో కూడా ఊహించలేదు. ముఖ్యంగా బాబుపై అవినీతి ఆరోపణలు కొత్తేమి కాదని ఇంత కాలం టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు. తనపై 26 కేసులు నమోదు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డే ఏమీ చేయలేకపోయారని, పిల్లకుంకైన ఆయన తనయుడు జగన్ ఏం చేస్తాడని పలు సందర్భాల్లో చంద్రబాబు అవహేళనగా మాట్లాడ్డాన్ని చూశాం, విన్నాం.
చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని టీడీపీ నేతలు చెప్పడం లేదు. రెండెకరాల ఆసామి వేల కోట్లకు అధిపతి అయ్యారంటేనే రాజకీయాల్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు సొంతింటిని చక్కదిద్దుకున్నారనేది జగమెరిగిన సత్యం. అయితే చంద్రబాబు అవినీతికి ఆధారాలు లేకుండా చేసుకునే తెలివి తేటలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే జగన్ రంధ్రాన్వేషణ చేసినా ఏమీ కాదనే ధీమాతో టీడీపీ నేతలు వుంటూ వచ్చారు. వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తూ ఇంత కాలం నెట్టుకొచ్చిన తన స్కిల్స్పై అతి నమ్మకమే చంద్రబాబును కటకటాలపాలు చేసింది.
అయితే అవినీతి కేసులో అరెస్ట్ కావడం కంటే, తనకు ఖైదీ నంబర్ ఒకటి వచ్చేలా చేశాడనే ఆలోచనే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు నిద్ర కరువు చేసింది. ఇంతకాలం జగన్ ఖైదీ నంబర్ 6093 అని చెబుతూ టీడీపీ నేతలు అసెంబ్లీలోనూ, బయట ఎద్దేవా చేస్తూ తెగ సంబరపడేవారు. కాలం అందరి లెక్కల్ని సరిచేసింది. ఇప్పుడు చంద్రబాబును అవినీతి కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం, అక్కడి అధికారులు ఆయనకు ఖైదీ నంబర్ 7691ను కేటాయించడం గమనార్హం.
ఇకపై చంద్రబాబు తాను నిప్పు, తన కొడుకు పప్పు అని గొప్పలు చెప్పుకోడానికి కుదరదు. ఎందుకంటే స్కిల్ స్కామ్లో ఖైదీ నంబర్ 7691 ఎవరిదంటే చంద్రబాబు పేరు చెబుతారు. దీన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. రాజకీయ ప్రత్యర్థులకు కష్టం కలిగితే సంబరాలు చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే మనకూ అలాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పేందుకే నిదర్శనమే ఖైదీ నంబర్ 7691. ఈ నంబర్తో పిలిపించుకోవడమే టీడీపీ మనసుకు చాలా కష్టంగా వుంది. అదే బాధంతా.