నాయకత్వ సమర్థతను నిరూపించుకునేందుకు లోకేశ్కు ఇంతకంటే మంచి సమయం రాదు. లోకేశ్పై ప్రత్యర్థుల విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకేశ్ను పప్పు, తుప్పు …ఇలా రకరకాలుగా ప్రత్యర్థులు అవహేళన చేయడం తెలిసిందే.
పాదయాత్ర లోకేశ్లో మార్పు తెస్తుందని అనుకున్నారు. కానీ ఆయన్ను హూందాతనం గల నాయకుడిగా పాదయాత్ర తీర్చిదిద్దలేకపోతోంది. ప్రత్యర్థులపై చిల్లర విమర్శలతో లోకేశ్ మరింత పలుచన అవుతున్నారు.
ఈ నేపథ్యంలో లోకేశ్కు పరీక్షా సమయం ఆసన్నమైంది. ఈ పరీక్షలో లోకేశ్ ఉత్తీర్ణుడైతేనే టీడీపీ భవిష్యత్ వారసుడిగా నిలుస్తారు. లేదంటే లోకేశ్ స్థానాన్ని మరొకరు భర్తీ చేయడానికి రెడీ అవుతారు. రాజకీయాల్లో నాయకత్వ లక్షణాలు ఉంటేనే రాణిస్తారు. వారసత్వం అనేది కేవలం ఎంట్రీ పాసే అనే సంగతి లోకేశ్ గుర్తించుకోవాల్సి వుంటుంది.
దివంగత ఎన్టీఆర్కు బోలెడంత మంది పిల్లలున్నా ఎవరూ ఆయన వారసత్వాన్ని కొనసాగించలేకపోయారు. అల్లుడైన చంద్రబాబునాయుడే చివరికి ఆ పార్టీకి పెద్ద దిక్కు అయ్యారు.
ఇప్పుడాయన అవినీతి కేసులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఇప్పుడు టీడీపీని ముందుకు నడిపే సమర్థవంతమైన నాయకుడి అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లోకేశ్ యువగళం పాదయాత్ర బస్సు రాజమండ్రికి చేరుకుంది.
తనకు అందుబాటులో ఉన్న టీడీపీ నాయకులతో బస్సులోనే లోకేశ్ తాజా పరిస్థితులపై సమీక్షించారు. చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో లోకేశ్ లోతుగా చర్చించినట్టు చెబుతున్నారు. అలాగే ఇవాళ్టి బంద్కు మద్దతు ఇచ్చిన ఇతర పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తన తండ్రి జైల్లో ఉన్నప్పుడు లోకేశ్ తీసుకునే నిర్ణయాలే ఆయన నాయకత్వ సమర్థతను చాటి చెబుతాయి. సరైన నిర్ణయాలతో పార్టీని ముందుకు నడుపుతున్నారనే భావన కలిగిస్తే లోకేశ్కు తిరుగుండదు. లేదంటే టీడీపీ నేతలు మరోదారి వెతుకులాటలో వుంటారని చెప్పక తప్పదు.