ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతిష్టాత్మక ‘థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్’ టోర్నీ నిర్వహిస్తుండ డంపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆగ్రహం , ఆందోళన వ్యక్తం చేశారు. సహజంగా సైనా నెహ్వాల్ ఆగ్రహావేశాలకు లోను కావడం, మాట జారడం ఎప్పుడూ, ఎవరూ చూసి ఉండరు. అలాంటిది మొట్ట మొదటిసారిగా అసహనాన్ని వ్యక్తం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. టోర్నీ నిర్వహణపై సైనా నెహ్వాల్ తన నిరసనను ట్విట్ ద్వారా వెల్లడించారు.
డెన్మార్క్లో అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు థామస్, ఉబెర్కప్ టోర్నీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తుండడంతో గత మార్చిలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు నిలిచిపోయాయి. ఈ టోర్నీతో తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) క్వారంటైన్ సౌకర్యాన్ని కల్పించింది.
ఈ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ‘బాయ్’ ప్రకటించింది. కానీ టోర్నీ నిర్వహణపై సైనా నెహ్వాల్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ ఏ మాత్రం తగ్గని ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ నిర్వహించడం ఆరోగ్య రీత్యా సురక్షితమేనా అని ఆమె ప్రశ్నించారు. మహమ్మారికి భయపడే ఏడు దేశాలు టోర్నీ నుంచి తప్పుకున్నాయని సైనా గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో టోర్నీ నిర్వహిం చడం ఏ మాత్రం సబబని ఆమె నిలదీశారు.