‘స్మార్ట్ సిటీ’ అమరావతికి 496 కోట్లు

స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద రాజధాని అమరావతికి ఇప్పటి వరకు 496 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు…

స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద రాజధాని అమరావతికి ఇప్పటి వరకు 496 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద ఎంపికైన రాజధాని అమరావతి కోసం 2017-18 నుంచి ఇప్పటి వరకు కేంద్రం 496 కోట్ల రూపాయలు విడుదల చేయగా ఆ మొత్తంలో 472 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద ఎంపికైన విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాలకు విడుదల చేసిన నిధుల గురించి ఆయన వివరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు విశాఖపట్నం నగరానికి 299 కోట్లు, తిరుపతికి 196 కోట్లు, కాకినాడకు 392 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి విడుదలైనట్లు మంత్రి తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 నగరాల అభివృద్ధి కోసం మొత్తం 23,054 కోట్ల రూపాయల నిధులను  కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా ఇప్పటి వరకు 18,614 కోట్ల రూపాయలను వివిధ నగరాలకు విడుదల చేసినట్లు చెప్పారు.

స్మార్ట్ సిటీస్ మిషన్‌ను వేగవంతంగా అమలు చేయడంలో ఎదురవుతున్న ఆటంకాల గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ మిషన్‌ను హడావిడిగా అమలు చేయడం తమ లక్ష్యం కాదని అన్నారు. మిషన్‌ కింద అమలు చేసే వివిధ ప్రాజెక్ట్‌లు నాణ్యతాపరంగా అత్యత్తమంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

 స్మార్ట్‌ సిటీస్‌ ఎంపిక తర్వాత స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీల ఎంపిక, మానవ వనరుల సమీకరణ, డీటెల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ల రూపకల్పన అనంతరమే ఆయా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలవడం జరుగుతుందని, ఈ ప్రక్రియలు పూర్తి కావడానికి తగినంత కాల వ్యవధి అవసరముందని చెప్పారు. 

గడచిన ఏడాదిగా మిషన్‌ అమలును వేగిరపరచగలిగామని అన్నారు. కేటాయించిన నిధులను ఆయా నగరాలు వినియోగించే వేగం కూడా 9 రెట్లు పెరిగిందని అన్నారు. మార్చి 2018 నాటికి కేవలం 1000 కోట్లు వినియోగిస్తే నవంబర్‌ 15, 2019 నాటికి అది 9497 కోట్ల రూపాయలకు పెరిగిందని మంత్రి వివరించారు.

177 కోట్లతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే విస్తరణ

భారీ విమానాల రాకపోకలకు అనువుగా ఉండే విధంగా  177 కోట్లతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేను విస్తరించి, పటిష్టపరిచే పనులను చేపట్టినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి చెప్పారు. రాజ్యసభలో బుధవారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ రన్‌వే విస్తరణ పనులు 2021 నాటికి పూర్తి కాగలవని భావిస్తున్నట్లు తెలిపారు.

రన్‌వే విస్తరణ కోసం ఇంకా 30.88 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి అప్పగించడం, స్వాధీనం చేసిన భూమిలో ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల తొలగింపులో జరుగుతున్న జాప్యం వల్లనే పనులు మందగించినట్లు చెప్పారు. తిరుపతి విమానాశ్రయంలో  181 కోట్ల రూపాయలతో జూన్‌ 2011లో కొత్తగా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణాన్ని చేపట్టిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ డిసెంబర్‌ 2015 నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసిందని మంత్రి తెలిపారు.