ఐటీశాఖ చంద్రబాబునాయుడికి నోటీసులు పంపడం ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతూనే వుంది. ఈ నోటీసుల వల్ల చంద్రబాబుకు ఏమవుతుందనే ప్రశ్న పక్కన పెడితే, ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడానికి అధికార పక్షం వైసీపీకి ఆయుధం దొరికినట్టైంది. తనను ఇబ్బంది పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామాగా చంద్రబాబు భావన. అయితే నోటీసులు ఇచ్చిన ఐటీశాఖను, అజమాయిషీ చేస్తున్న మోదీ సర్కార్ను విమర్శించలేని నిస్సహాయ స్థితి చంద్రబాబుది.
రూ.118 కోట్లకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఐటీశాఖ నోటీసులపై చంద్రబాబు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుండడంతో అసలు ఆయన ఆలోచన ఏంటనే చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడిపై మంత్రి ఆర్కే రోజా తనదైన స్టైల్లో ప్రశ్నలతో బాబును రాజకీయంగా చితక్కొట్టడం గమనార్హం.
ముడుపుల కేసులో ధైర్యంగా విచారణ ఎదుర్కొంటారా? అని ప్రశ్నించారు. బామ్మర్దిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా? అచ్చెన్నాయుడిలా రమేశ్ ఆస్పత్రిలో చేరుతారా? విజయమాల్యా మాదిరిగా విదేశాలకు పారిపోతారా? లేక ఎప్పట్లాగే స్టే తెచ్చుకుంటారా? అని రోజా ప్రశ్నించారు.
గతంలో తన ఇంట్లో కాల్పులు జరిగిన ఘటనలో నందమూరి బాలకృష్ణ తనకు మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకోవడాన్ని రోజా పరోక్షంగా ప్రస్తావించారు. అలాగే ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తాను ఫైల్స్తో బాధపడుతున్నానంటూ ట్రీట్మెంట్ కోసం విజయవాడలో టీడీపీకి చెందిన రమేశ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేస్తారేమో అని చంద్రబాబు కామెంట్స్ చేయడంతో, ఒకవేళ అదే జరిగితే ఆస్పత్రిలో అడ్మిట్ అవుతారేమో అని రోజా వెటకరించారు. రోజా ప్రతిరోజూ చంద్రబాబు, లోకేశ్లపై పంచ్లు విసురుతూ మీడియాను ఆకర్షిస్తున్నారు.