ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న టాక్ షోకు జనసేనాని పవన్కల్యాణ్ గెస్ట్గా హాజరవడం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇవాళ టీజర్ విడుదలైంది. త్వరలో ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇవాళ్టి టీజర్లో పవన్కల్యాణ్ను బాలయ్య రాజకీయ అంశాల గురించి ప్రశ్నించడం ఆసక్తి రేపుతోంది. ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’
‘రాష్ట్రం(ఏపీ)లో మీ అభిమాని కాని వాడు లేడు. కానీ ఆ ప్రేమ ఓట్లగా ఎందుకు మారలేదు’ అని ప్రశ్నను బాలయ్య సూటిగా సంధించారు. ఇందుకు సమాధానాన్ని సస్పెన్స్లో పెట్టడం గమనార్హం. ఈ ప్రశ్నకు పవన్ సమాధానం సంగతి కాసేపు పక్కన పెడదాం. పౌర సమాజం నుంచి సమాధానాలు వెల్లువెత్తుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందు టీడీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలకు దిగారు.
చంద్రబాబు, ఆయన తనయుడైన లోకేశ్ అవినీతిపై తీవ్రస్థాయిలో పవన్ ధ్వజమెత్తారు. తీరా ఎన్నికల సమీపించే నాటికి మరోసారి జగన్ను ఓడించమే ప్రధాన ధ్యేయంగా పవన్కల్యాణ్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం బలపడింది. జనసేన నిలబడ్డ రెండు చోట్ల చంద్రబాబు ప్రచారం చేయలేదు. అలాగే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పోటీ చేసిన చోట పవన్కల్యాణ్ ప్రచారం చేయలేదు. దీంతో ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్ వాళ్లిద్దరి లోపాయికారి ఒప్పందంపై చేసిన విమర్శలను జనం నమ్మారు.
ఐదేళ్ల చంద్రబాబు పాలనకు విసిగిపోయిన జనం… ఒకవేళ పవన్కు ఓటు వేస్తే మళ్లీ టీడీపీ అధినేతనే అధికారంలోకి తెచ్చుకున్నట్టు అవుతుందని భయపడ్డారు. దీంతో పవన్ అభిమానులు కూడా ఆయన్ను అనుమానించే పరిస్థితి. తన సభలకు అభిమానులు వచ్చారని, కానీ ఓట్లు మాత్రం జగన్కే వేశారని పలు సందర్భాల్లో పవన్ బహిరంగంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ రాజకీయ పంథా… చంద్రబాబు పల్లకీ మోయడానికే అనే అభిప్రాయాన్ని కలిగించింది. అందుకే ఆయనకు అభిమానులతో పాటు ప్రజానీకం ప్రేమ దక్కలేదు. ఇందులో పెద్దగా దాపరికం కూడా ఏమీలేదు. ప్రజాదరణ పొందకపోవడంపై పవన్ను బాలయ్య ప్రశ్నించిన నేపథ్యంలో… జనసేనాని రాజకీయ విధానాలపై చర్చకు తెరలేచింది.