సెప్టెంబర్ 28న రూల్స్ రంజన్

'రాజా వారు రాణి గారు', 'ఎస్సాఆర్ కళ్యాణ మండపం', 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం 'రూల్స్ రంజన్'. 'నీ మనసు నాకు…

'రాజా వారు రాణి గారు', 'ఎస్సాఆర్ కళ్యాణ మండపం', 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం 'రూల్స్ రంజన్'. 'నీ మనసు నాకు తెలుసు', 'ఆక్సిజన్' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. పాటలకు వస్తున్న అద్భుతమైన స్పందనతో ఎంతో సంతోషంగా ఉన్న నిర్మాతలు తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

'ఇంట్రడక్షన్ ఆఫ్ రూల్స్ రంజాన్' పేరుతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా కోసం ప్రత్యేకంగా నాలుగో పాటని ప్రదర్శించారు. గత మూడు పాటల్లాగే నాలుగో పాట కూడా కట్టిపడేసింది. అలాగే ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ఏ.ఎం. రత్నం చేతుల మీదుగా విడుదల తేదీని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కిరణ్ కథ విని, బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారట. ఇప్పుడు పాటలు బాలేకపోతే సినిమా మధ్యలో లేచి వెళ్లిపోతున్నారు. అందుకే సంగీతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పాను. నా అనుభవం ప్రకారం ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. కుటుంబమంతా కలిసి చూడగలిగేలా ఉన్న ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

కథానాయకుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “రూల్స్ రంజన్ ప్రయాణం ఏడాది క్రితం మొదలైంది. మనో రంజన్ మనలో ఒకడిలా ఉంటాడు. అందరూ ఈ పాత్రకి కనెక్ట్ అవుతారు. ఇంత మంచి పాటలు ఇచ్చిన అమ్రిష్ కి ధన్యవాదాలు. నేపథ్య సంగీతం కూడా అదే స్థాయిలో ఉంటుంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన దర్శకనిర్మాతలకు, నేహా శెట్టి, ఇతర చిత్ర బృందానికి అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు” అన్నారు.

కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ.. “ఈ అవకాశం ఇచ్చిన నా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. 'సమ్మోహనుడా' పాటకి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాట విజయానికి కారణమైన అమ్రిష్ గారికి, శ్రేయా ఘోషల్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. 'డీజే టిల్లు'లో రాధిక పాత్ర తర్వాత, ఈ సినిమాలో నేను పోషించిన సనా పాత్ర ప్రేక్షకులను అంతలా మెప్పిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

దర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ.. “నా గత చిత్రం 'ఆక్సిజన్'ని మంచి సందేశాత్మకంగా చేశాను. ఆ సినిమాకి థియేటర్లలో ఆశించిన ఆదరణ లభించలేదు కానీ.. ఓటీటీలలో, టీవీల్లో చూసి ఎందరో ఫోన్లు చేసి అభినందించారు. అప్పుడు ప్రేక్షకులకు ఓ మంచి వినోదాత్మక చిత్రం అందించాలని నిర్ణయించుకున్నాను. అలా చేసిందే ఈ 'రూల్స్ రంజన్'. అనుకోకుండా ఈ కథ నా స్నేహితులు దివ్యాంగ్, మురళికి వినిపించడం.. వారు పట్టుబట్టి సినిమా నిర్మిస్తామని ముందుకు రావడం జరిగిపోయాయి” అన్నారు.

నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు అమ్రిష్ గణేష్ తదితరులు ప్రసంగించారు.