విశాఖ బీచ్ అంటే సాయంత్రం అందంగా ఉంటుందని చూడాలని అంతా అనుకుంటారు. అయితే రాత్రి వేళ ఇంకా అద్భుతంగా ఉంటోంది. దానికి కారణం విశాఖ బీచ్ రోడ్డు అంతటా పలు ప్రాంతాలలో కాంతివంతమైన లైట్లను ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాటు చేశారు. దాంతో అర్ధ రాత్రి కూడా అక్కడ పట్టపగలు మాదిరిగా ఉంటోంది.
విశాఖలోని రామక్రిష్ణా బీచ్ నుంచి రెండు కిలోమీటర్ల మేర ఈ అద్భుతమైన లైటింగుతో రాత్రే పగలుగా జిగేల్మనిపిస్తోంది. జీ 20 సన్నాక సమావేశాలు కొద్ది నెలల క్రితం విశాఖలో జరిగాయి. అనాడు విదేశీ సందర్శకులను ప్రతినిధులను ఆకట్టుకునేందుకు విశాఖ సాగర తీరం అంతటా పండు వెన్నెల కాంతులతో లైటింగ్స్ అమర్చారు.
జీ 20 పుణ్యమా అని అమర్చిన ఆ లైట్లు ఇపుడు విశాఖ వాసులకు కనుల విందుగా మారుతున్నాయి. ఈ లైట్లను చూసేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు నగర వాసులు విశాఖ బీచ్ కి రాత్రి వేళలలో పెద్ద సంఖ్యలో రావడం విశేషంగా ఉంది.
విశాఖ రాత్రి అయినా కూడా తగ్గని జనాల సందడి ఉత్సాహంతో సాగర కెరటాలతో పోటీ పడుతోంది. విశాఖ బీచ్ రోడ్స్ ని బ్యూటిఫికేషన్ లో భాగంగా మరింతగా అభివృద్ధి చేస్తామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.