నెల్లూరు జిల్లా కందుకూరులో విషాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హూందాగా స్పందించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తన వ్యతిరేకి అయిన చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి, అలాగే పలువురు గాయపడడంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం తరపున ఆయన సాయం ప్రకటించడం గమనార్హం. దుర్ఘటనకు సంబంధించి రాజకీయ కోణంలో చూడకుండా, బాధితులకు అండగా నిలబడడం అభినందించదగ్గ విషయం.
ఇదిలా వుండగా చంద్రబాబు సభ నిర్వహణ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సభలకు వేలాది మంది వెల్లువెత్తుతున్నారనే సంకేతాల్ని పంపేందుకు ఇరుకు సందుల్లో నిర్వహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీని నుంచి బయట పడేందుకు టీడీపీ తంటాలు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా జగన్ సాయం ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు.