ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం రాజకీయాలను వేడెక్కిస్తోంది. తాజాగా ఆమె సీబీఐకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తనపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు కవిత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన పేరు వినిపించడానికి ముందు కవిత పెద్దగా మీడియాతో మాట్లాడేవాళ్లు కాదు. సభలు, సమావేశాల్లో రెండు మాటలు మాట్లాడేవారామె.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తనపై వచ్చిన విమర్శలను తనే తిప్పికొట్టాలని ఆమె బలంగా నిర్ణయించుకున్నారు. అందుకే పదేపదే ఆమె మీడియాతో మాట్లాడుతున్నారు. ఇవాళ ఆమె మీడియా మిత్రులతో చిట్చాట్లో మాట్లాడారు. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బండి సంజయ్ వాడుతున్న పదజాలం అవమానించేలా వుందని ఆమె వాపోయారు. బండి సంజయ్ అసభ్యంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. తనపై సంజయ్ ప్రయోగిస్తున్న భాష బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ నుంచి బండి సంజయ్ వరకూ అందరూ మహిళలను అవమానించే సంస్కృతి వుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని సరైన సమయంలో తిప్పికొడ్తారని కవిత హెచ్చరించారు. బతుకమ్మ పండుగ వెనుక 12 ఏళ్ల కష్టం వుందన్నారు. అది డిస్కో డ్యాన్స్ అంటూ సంజయ్ మాట్లాడ్డం ఏంటని ఆమె నిలదీశారు. ఇది బతుకమ్మను అవమానించడమే అని ఆమె ఆగ్రహం వ్య్ష్టక్తం చేశారు.
బండి సంజయ్ అభ్యంతరకర భాష తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అవమానించేలా వుందని దుయ్యబట్టారు. ఇదిలా వుండగా దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారనే సమాధానంపై కవిత స్పందించారు. ఓ ఒక్క దానికి సమాధానం సస్పెన్స్ అని కవిత దాటవేయడం గమనార్హం.