యోగా గురు రాందేవ్ బాబా మహిళలపై తీవ్ర అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై దేశ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా రాందేవ్ బాబాపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తనదైన శైలిలో రాందేవ్పై విరుచుకుపడ్డారు. అతన్ని మహిళలే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలని పిలుపునివ్వడం గమనార్హం.
మహారాష్ట్రలోని థానెలో యోగా సైన్స్ క్యాంప్లో రాందేవ్ బాబా మాట్లాడుతూ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. “మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. సల్వార్ సూట్స్లో బాగుంటారు. ఇంకా చెప్పాలంటే నా కళ్లకైతే వాళ్లు దుస్తులు ధరించకున్నా అందంగానే వుంటారు” అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఇదే వేదికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఉండడం గమనార్హం.
ఈ నేపథ్యంలో నారాయణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ రాందేవ్ బాబాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారని అన్నారు. వాస్తవానికి మహిళలే చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే చెప్పుతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలను నీచంగా మాట్లాడ్డం చూస్తే… అంతకంటే స్త్రీ వ్యతిరేకి ఎవరుంటారని ఆయన ప్రశ్నించారు. మహిళా వ్యతిరేక చట్టం కింద అతన్ని విచారించాలని డిమాండ్ చేశారు.
ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం రాందేవ్ బాబాకు అలవాటే. కరోనా సమయంలో వైద్యులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మహిళలను కించపరిచేలా కామెంట్స్ చేయడంపై రాజకీయాలకు అతీతంగా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దీనికి క్షమాపణతో సరిపెడతారా? లేక మరే చర్య అయినా ప్రభుత్వం తీసుకుంటుందా? అనేది తేలాల్సి వుంది.