ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు టీడీపీ టికెట్ను మళ్లీ ఆమెకే ఇవ్వనున్నారు. సత్యవేడు ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే హేమలత పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించడం విశేషం. 2009లో సత్యవేడు నుంచి హేమలత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆమెపై జనంలో వ్యతిరేకత కారణంగా టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారు. దీంతో 2014, 2019 ఎన్నికల్లో ఆమె టీడీపీ టికెట్కు నోచుకోలేదు.
2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన జేడీ రాజశేఖరే సత్యవేడులో పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. కానీ హేమలత, జేడీ మధ్య తీవ్రస్థాయిలో వైరం నడుస్తోంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీలో విభేదాలు వైసీపీకి లాభిస్తున్నాయని చెప్పొచ్చు. ఆదిమూలంపై కంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రతిపక్షాలకు అనుకూలిస్తుందని టీడీపీ భావిస్తోంది. అయితే సొంత పార్టీలోని విభేదాల వల్ల మరోసారి నష్టపోవాల్సి వస్తుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏడాదిన్నర ముందుగానే సత్యవేడు టికెట్ను హేమలతకు ఖరారు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఈమె సత్యవేడులో ప్రస్తుత మంత్రి నారాయణస్వామిని ఓడించారు. నియోజకవర్గం వ్యాప్తంగా చెప్పుకోదగ్గ పలుకుబడి ఆమెకు వుంది. ఇక జేడీ రాజశేఖర్ను పార్టీ కోసం పని చేసేలా ఒప్పించేందుకు అధిష్టానం చర్చలు జరుపుతోంది.
పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి చెబుతూ, హేమలతకు మద్దతుగా సత్యవేడు నియోజకవర్గ వ్యాప్తంగా తిరగాలని జేడీకి సూచిస్తున్నారని తెలిసింది. అయితే ముందుగా నిర్ణయం తీసుకోవడం వల్ల అసంతృవాదులు సర్దుకుంటారని, పార్టీకి పెద్దగా నష్టం వుండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2009 ఫలితం సత్యవేడులో రిపీట్ అవుతుందా? లేదా? అనేది తేలాల్సి వుంది.