తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆంధ్రా ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. బంజారాహిల్స్లోని సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాలంటూ 41ఎ సీఆర్పీసీ నోటీసులను సిట్ ఇచ్చిందనే వార్త బయటికి రావడంతో రఘురామ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రతిరోజూ ఆయన ఢిల్లీలో కూచుని ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు.
ఇటీవల కాలంలో ఆయన విమర్శలను జనం పట్టించుకోవడం మానేశారు. పనిగట్టుకుని మరీ జగన్ ప్రభుత్వంపై బురదచల్లుతున్నాడని జనానికి అర్థమైంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సమగ్ర దర్యాప్తు నిమిత్తం ఏర్పాటైన సిట్ రఘురామకు నోటీసులు ఇవ్వడం సహజంగానే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తెలంగాణ సర్కార్ను బీజేపీ కూలదోసేందుకు కుట్రలు చేస్తోందని టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ఎంపీలు కాకుండా, ఆంధ్రప్రదేశ్కు చెందిన నాన్ బీజేపీ ఎంపీ పేరు తెరపైకి రావడం రాజకీయంగా సంచలనమే. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రఘురామ పాత్రకు సంబంధించి సిట్కు కీలక ఆధారాలు దొరికాయనే చర్చ నడుస్తోంది. అయితే రఘురామ గురించి జనం ఏమనుకుంటున్నారనేది ఆసక్తికర అంశం.
రఘురామ వ్యవహారశైలి తెలిసిన ప్రతి ఒక్కరూ… ఇలాంటి పనికిమాలిన పనేదో ఆయన చేసే వుంటారనే వాళ్లే ఎక్కువ వుండడం గమనార్హం. సాధారణంగా ఒక నాయకుడి ప్రవర్తన తెలిసిన ప్రజలు, ఆయన చర్యలపై స్పష్టమైన అవగాహనతో వుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెల్లారి లేచినప్పటి నుంచి చిల్లర చేష్టలు చేసే నాయకులను జనం గొప్పగా ఊహించుకోలేరు. ప్రతిదీ డబ్బుతో కొనుగోలు చేయొచ్చనే అహంకారంతో రఘురామ వ్యవహరిస్తుంటారని రాజకీయాలకు అతీతంగా ఆయన గురించి అంటుంటారు. నాగభూషణం, కోట శ్రీనివాస్, రఘువరన్ తదితర నటుల్ని హీరోలుగా ఊహించుకోవడం ఎంత అసహజమో, రఘురామకు ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేదంటే నమ్మడం కూడా అంతే అసహజమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. రఘురామ అంటే ఒక రకమైన చిల్లర క్యారెక్టర్కు ప్రతీక అని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిజంగా ఆయన ప్రమేయం ఉందో లేదో తెలియనప్పటికీ, జనం మాత్రం నెగెటివ్ కోణంలోనే చూడడం ఆసక్తికర పరిణామం. గత మూడున్నరేళ్లలో రఘురామ సంపాదించుకున్న విశ్వసనీయ ఇదే అని సరిపెట్టుకోవడం తప్ప ఏం చేయగలం? ఎందుకంటే తనను సమాజం ఉన్నతంగా చూడాలనే ఆకాంక్ష అసలైన నాయకుడికే లేనప్పుడు, జనానికి మాత్రం ఏం పట్టింది? ఏపీ సీఐడీ విచారణలో చోటు చేసుకున్న పరిణామాలు సిట్ దర్యాప్తులో పునరావృతం కాకూడదని కోరుకోవడం తప్ప… జనం ఏం చేయగలరు?