తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో టీఆర్ఎస్ సర్కార్ సిట్ ఏర్పాటు చేసి, బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తోంది. మరోవైపు ఐటీ, ఈడీ, సీబీఐలతో టీఆర్ఎస్ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల్ని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ వేటాడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కుమార్తె కవిత బీజేపీ నేతలపై విమర్శలను పెంచడం గమనార్హం.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కవిత మాట్లాడుతూ బీజేపీ నాయకులు రాముని పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణలో ఒక్క మంత్రిని, ఎమ్మెల్యేను, ఎంపీని కేంద్ర దర్యాప్తు సంస్థలు విడిచిపెట్టలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట బద్ధంగా వ్యాపారం చేసుకోవడంలో తప్పేం ఉందని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారని ఆమె ధ్వజమెత్తారు. అడ్డంగా దొరికిన దొంగలను విచారించకూడదని బీజేపీ నేతలు అంటున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు సంబంధం లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టకు వెళ్లి దొంగ ప్రమాణాలు చేశాడని కవిత మండిపడ్డారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ పేరు బయటకు వచ్చిందన్నారు. అయితే విచారణకు రమ్మంటే ఆయన పారిపోయాడని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ నిన్న ఏడ్వనే ఏడ్చిండని ఆమె వ్యంగ్యంగా అన్నారు. తమ నాయకులంతా మంచోళ్లని, న్యాయస్థానానికి వెళ్తామని ఆయన చెబుతున్నాడని కవిత అన్నారు. ఇదే టీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలకు వెళ్తున్నారని, బీఎల్ సంతోష్, ఆ పార్టీ నాయకులు ఎందుకు పరారవుతున్నారని ఆమె ప్రశ్నించడం గమనార్హం.