జనసేనాని పవన్కల్యాణ్ వైఖరిపై ఎల్లో బ్యాచ్ ఆగ్రహంగా వుంది. ఇందుకు ఆ కూటమిలోని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం, ఆవేదనే నిదర్శనం. బీజేపీతోనే పవన్ రాజకీయ ప్రయాణం సాగిస్తే… చంద్రబాబు అధికారంలోకి రాలేరనే భయం, ఆందోళన రామకృష్ణ మాటల్లో ప్రతిబింబిస్తున్నాయి. అందుకే ఆయన పవన్కల్యాణ్పై కాస్త కఠువుగానే మాట్లాడారు.
మీడియాతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చిన పవన్కల్యాణ్… ఇవాళ జనసేన సెపరేట్ అనడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ మంత్రుల బ్లాక్ మెయిల్కు పవన్కల్యాణ్ భయపడే తాను సెపరేట్ అంటున్నారని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ ఒకరికొకరు ఒద్దికగా కలిసిపోయారని అక్కసు వెళ్లగక్కారు. కేంద్రానికి ప్రతి విషయంలో వైసీపీ ఎంపీలు సహకరిస్తున్నారని చెప్పుకొచ్చారు.
బీజేపీ, వైసీపీ పెళ్లి చేసుకోలేదని, కానీ కలిసి కాపురం చేస్తున్నారని ఆయన ఘాటు విమర్శ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ చేతులు కలపాలని పవన్ అన్నారని రామకృష్ణ గుర్తు చేశారు. 175 సీట్లలో పోటీ చేయాలని , పొత్తులు పెట్టుకోవద్దని, సర్దుబాట్లు చేసుకోవద్దని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.
ప్రతిపక్షాల అజెండాను వైసీపీ నిర్ణయిస్తుందా? లేక మనంతకు మనమే నిర్ణయించుకుందామా? అని ఆయన ప్రశ్నించారు. జగన్, నరేంద్ర మోదీ పరస్పరం సహకరించుకుంటున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతున్నారంటే… రాజకీయాల్లో అమాయకత్వాన్ని నటిస్తున్నాడా? అమాయకత్వం ప్రదర్శిస్తున్నాడా? లేదా నిజమైన అమాయకత్వమా? అనేది తేలాల్సి వుందని రామకృష్ణ సీరియస్ కామెంట్స్ చేశారు.
పవన్కు సంబంధించి మూడు తేలాల్సినవి ఉన్నట్టు ఆయన ప్రశ్నలు సంధించారు. పవన్ శీలాన్ని శంకించేలా రామకృష్ణ మాట్లాడారు. జనసేన నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.