మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రి చెన్నారెడ్డి కుమారుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి బీజేపీలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని మర్రి శశిధర్రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే మర్రి శశిధర్రెడ్డి సమీప బంధువు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
గత కొంత కాలంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై మర్రి శశిధర్రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రేవంత్రెడ్డి వ్యాఖ్యలను శశిధర్రెడ్డి తప్పు పట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రేవంత్ అవమానించారని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి వ్యవహారశైలిపై శశిధర్రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ కార్యకలాపాలకు కూడా దూరంగా వుంటున్నారు.
ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్కు కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడంతో ఆ పార్టీ అసంతృప్తవాదులకు తగిన కారణం దొరికనట్టైంది. కాంగ్రెస్లో జాతీయ స్థాయి మొదలుకుని రాష్ట్రస్థాయి వరకూ నాయకత్వ సమస్య వేధిస్తోంది. వరుస ఓటములను ఆ పార్టీని రోజురోజుకూ కుంగదీస్తున్నాయి. ఏ దశలోనూ పార్టీ కోలుకుంటుందనే నమ్మకాన్ని నాయకత్వం కలిగించలేకపోతోంది.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు పార్టీని మరింతగా దిగజారుస్తున్నాయి. కాంగ్రెస్లో గొడవల వల్లే మునుగోడులో పాల్వాయి స్రవంతికి కనీసం డిపాజిట్ రాలేదని ఆ పార్టీ అంతర్గత విశ్లేషణలో నిర్ధారించుకున్నారు. భవిష్యత్లో కాంగ్రెస్ నేతలంతా కలిసి పని చేస్తారనే నమ్మకం కూడా లేకపోవడంతో తమ భవిష్యత్ను చూసుకోవడం మంచిదనే ఆలోచనలో ఉన్నారు. ఈ కోణంలో మర్రి శశిధర్రెడ్డి పార్టీ మార్పు అంశం తెరపైకి వచ్చింది.