సూపర్స్టార్ కృష్ణ లాంటి మంచి మనిషిని ఇక చూడలేమని నటి, ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇవాళ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణ మృతి బాధాకరమన్నారు. చిత్రపరిశ్రమలో ప్రతిభావంతులు చాలా మంది ఉంటారన్నారు. కానీ శత్రువులనేవాళ్లు లేకుండా, అందరూ ఇష్టపడే ఒకే ఒక్క హీరో కృష్ణ మాత్రమే అని రోజా తెలిపారు.
కృష్ణ ఇక లేరంటే జీర్ణించుకోలేని పరిస్థితి అన్నారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ గారిని భగవంతుడు తనకు కావాలని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి కృష్ణకు తాను పెద్ద అభిమాని అని చెప్పుకొచ్చారు. ఆయనతో హీరోయిన్గా చేస్తున్నప్పుడు ప్రతిరోజూ కృష్ణనే చూసేదాన్నని రోజా అన్నారు. అద్భుతమైన, ప్రతిభావంతుడు, మంచి మనిషితో కలిసి పని చేయడం అదృష్టంగా భావించినట్టు రోజా చెప్పారు. కృష్ణ సొంత బ్యానర్లో సినిమాలు చేయడం తన అదృష్టంగా రోజా తెలిపారు.
కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. కళామతల్లి, అలాగే ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేశారన్నారు. సాహసాలు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్స్టార్ కృష్ణ అని రోజా వెల్లడించారు. ఫస్ట్ 70ఎంఎం సినిమా తీసింది ఆయనే అని గుర్తు చేశారు. అలాగే ఫస్ట్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు తీసింది కూడా ఆయనే అని రోజా పొగడ్తలతో ముంచెత్తారు. కృష్ణ సినిమా వల్లే మనందరికీ అల్లూరి సీతారామరాజు గురించి తెలిసిందన్నారు. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ రూపమే కనిపిస్తుందన్నారు.
కృష్ణ జీవితం నుంచి తెలుసుకోవాల్సింది ఒక్కటే అంటూ రోజా వివరించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్ వుంటాయన్నారు. సక్పెస్, ఫెయిల్యూర్లను సమానంగా తీసుకుంటే, ప్రశాంతంగా వుంటామనే పాఠాన్ని కృష్ణ జీవితం నుంచి నేర్చుకోవాలన్నారు. ఎంత పెద్దస్థాయికి ఎదిగినా అందరితో బాగుండాలనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకోవాలని రోజా సూచించారు.
కొంత మందికి రెండు సినిమాలు హిట్ కాగానే కొమ్ములొస్తాయని అభినయిస్తూ రోజా చెప్పారు. రెండు సినిమాలు ప్లాప్ అయితే చాలు ఒత్తిడికి లోనై ఎక్కడికి వెళ్లిపోతారో తెలియదన్నారు. కృష్ణ, విజయనిర్మల ఆదరణను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. మహేశ్ చిన్నప్పటి నుంచి తనకు ఇష్టమన్నారు. మరోసారి కెమెరా ముందుకొస్తే మహేశ్ అత్తగా నటించాలనే కోరికను మరోసారి రోజా బయట పెట్టారు.