సుపారీ: పవన్ కు అంత రేటు ఉందా?

ఆయన సినిమా చేస్తానంటే బోలెడు కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. ఎంత కుమ్మరిస్తారు అనే విషయంలో ఎప్పటికీ, ఎవరికీ స్పష్టత ఉండదు. సుమారుగా ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయలు తీసుకుంటాడని ఇండస్ట్రీలో అనుకుంటూ ఉండే…

ఆయన సినిమా చేస్తానంటే బోలెడు కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. ఎంత కుమ్మరిస్తారు అనే విషయంలో ఎప్పటికీ, ఎవరికీ స్పష్టత ఉండదు. సుమారుగా ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయలు తీసుకుంటాడని ఇండస్ట్రీలో అనుకుంటూ ఉండే పవన్ కళ్యాణ్.. ఆదాయపు పన్ను లెక్కల్లో ఎంత చూపిస్తాడో తెలియదు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఏం జరుగుతుంది. ఎవరికి నష్టం? ఎవరికి లాభం? ఈ విషయాలు మనబోటి సామాన్యులకు అర్థం కావు. 

కానీ, అలాంటి పవన్ కళ్యాణ్ ను అంతం చేయడానికి 250 కోట్ల రూపాయల పెట్టుబడి ఎవరైనా పెడతారా? ఆయన తలకాయకు అంత రేటు ఉందా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా మెలుగుతున్న సందేహం.

ఈ సందేహానికి చర్చకి సరికొత్తగా తెర తీసిన వారు తెలుగుదేశం ప్రముఖ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు. పవన్ కళ్యాణ్ హత్యకు 250 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని.. ఆ హత్యాపథకంలో భాగంగానే ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని.. బొండా ఉమా ఒక కొత్త సంగతిని బయటపెట్టారు. 

ఆయన కెజిబి, సిఐఏ వంటి ప్రపంచ సుప్రసిద్ధ గూడచార సంస్థలలో ఎప్పుడు చేరారో మనకు తెలియదు. 250 కోట్ల సుపారీ గురించి అంతరహస్య సమాచారాన్ని ఎలా దొరకబుచ్చుకున్నారో కూడా మనకు తెలియదు. ఆధారాలు అడిగితే బహుశా ‘నా వద్ద ఉన్నాయి. అవసరమైనప్పుడు, తగిన సమయం చూసి బయటపెడతా’ అని రొటీన్ బుకాయంపు మాటలు వేసినా మనకు ఆశ్చర్యం లేదు. కానీ తలా తోకా లేకుండా రేటు ఎంత ఉంటుందనే క్లారిటీ కూడా లేకుండా పవన్ హత్యకు రెండు వందల యాభై కోట్ల రూపాయల సుపారీ అని.. ప్రజలు నమ్మడానికి కాదు కదా– నవ్వడానికి వీలుగా ఒక మాట అన్నారు!

అయితే ప్రజల మదిలో మెదులుతున్న సందేహం ఇంకొకటి ఉంది. ఇంతకూ పవన్ కళ్యాణ్ హత్యకు సుపారీ ఇచ్చినది ఎవరు? వైసీపీ పార్టీ అంటే అయితే ఆ విషయం బోండా ఉమాకు తెలిసే అవకాశం లేదు. తెలుగుదేశం ఇచ్చి ఉంటే గనుక రేటు అంత ఖచ్చితంగా ఆయనకు తెలిసి ఉండొచ్చు అనేది ప్రజలు అనుకుంటున్న మాట. అందుకే రెక్కి జరిగిందని అనుకున్న వెంటనే వైసీపీ మీద నెట్టేయడానికి ఈ తెలుగుదేశం నాయకుడు తొందరపడుతున్నారని అనుకుంటున్నారు.

ఇప్పుడు అర్జంటుగా పవన్ కల్యాణ్ హత్యకు గురైతే గనుక.. తెలుగుదేశానికే ఎక్కువ లాభం. ఎటూ చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధపడ్డాడు గనుక.. దత్తపుత్రుడే.. 

పవన్ పోతే.. ఆ జాలి, సానుభూతి చంద్రబాబుకే లాభిస్తాయి. అలాంటి లాభాన్ని లెక్కవేసుకుని తానే సుపారీ ఇవ్వగల ఘటనా ఘటన సమర్థుడు చంద్రబాబు అనికూడా బహుశా బొండా ఉమా ఈ ఆరోపణలు చేశారేమో తెలియదు. లేదా.. కన్నకొడుకును పక్కన పెట్టి.. చంద్రబాబు దత్తపుత్రుడిని నెత్తిన పెట్టుకుంటున్నారనే కోపంతో.. ఆ కోటరీకి చెందిన వారు ఎవరైనా ఈ సుపారీకి ప్లాన్ చేశారని బోండా ఉమాకు మాత్రమే తెలుసునేమో.. ఆయన క్లారిటీ ఇస్తే బాగుంటుంది.