నిన్న రాత్రి నుంచి సినిమా నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర ఎవరో రెక్కీ నిర్వహిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జనసైనికులతో పాటు టీడీపీ అనుకూల మీడియా ఒక్కటే హడావుడి. తీరా చూస్తే అది పవన్ ఇంటి పక్కన ఉన్న పబ్బుల్లో తాగిన వారు చేసిన రచ్చ అని తెలిసిపోయింది. దీనికి జనసేన నుంచి అప్పటికప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి పవన్ కోసం రెక్కీ నిర్వహిస్తున్నారంటూ నానా రచ్చ చేశారు.
ఇటీవలే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన అనేది రాజకీయ పార్టీ అనుకోనని అది ఒక సెలబ్రిటీ పార్టీ అని అన్నారు, అయితే జనసేన కనీసం సెలబ్రిటీ పార్టీ కూడా కాదు అని, జనసేన అనేది ఫేక్ పార్టీ అన్నట్టుగా మారింది నిన్న జరిగిన హైడ్రామాతో. నిజానిజాలు తెలీయకుండా నోటికి వచ్చింది చెప్పడంలో టీడీపీ కంటే జనసేన ముందున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడ జరిగింది తాగుబోతుల గొడవ అయితే ఎల్లో మీడియాలోనూ, పవన్ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లలోనూ రకరకాల కథనాలతో వార్తలు వచ్చాయి.
ఒక ఛానెలో అయితే.. జనసేన ఆఫీసు వద్ద సీఐడీ అధికారులు రెక్కీ నిర్వహించారని, మరో దాంట్లో పవన్ పై దాడి అని, జనసేన అనుబంధ మీడియాలో సరాసరి వారిని గుజరాత్ నుండి వచ్చిన గుండాలు అని చెబుతూ.. హడవుడి చేశారు. కనీసం అక్కడ జరిగిన సంగతి బయటపడిన తర్వాత అయినా తమ యూట్యూబ్ ఛానెల్స్ లో థంబ్ నెయిల్స్ కూడా మర్చుకోలేదంటే ఎంత కరువుతో ఉన్నారో అర్థం అవుతోంది. జనసేన నాయకులు కొంత మంది మాట్లాడుతూ పవన్ కు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని అమిత్ షా కు బహిరంగ విజ్ఞప్తి చేసేశారు!. నిజమే నెలలో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి రాజకీయం చేసే నాయకుడుకి భద్రత కావాలి కదా.
సోషల్ మీడియాలో హడవుడి చేసి రాజకీయం చేయాలనుకుంటే అంత కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అందులోనూ ముఖ్యంగా ఈ హడావుడి ఆంధ్రప్రదేశ్ లో జరిగివుంటే… ఇతర పార్టీ రాజకీయ మేథావులు ఎలాంటి మాటలు మాట్లాడేవారో అర్థం చేసుకోవడం కష్టం కాదు. టీడీపీ, జనసేన ఇరు పార్టీలు కూడా సినిమా రంగం నుండి పుట్టినవే, బహుశా అందుకే ప్రజా పోరాటాల కంటే డ్రామాలతో ఓట్లు పొందాలని చూస్తున్నాయి కాబోలు!
ఈ ఘటనపై పవన్ రాజకీయ గురువు, టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి సానుభూతి ఇంకా వ్యక్తం కాలేదు. బహుశా మరి కొన్ని గంటలో పవన్ ను కలిసి సానుభూతి వ్యక్తం చేస్తారేమో!