సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిమిటెడ్) చైర్మన్గా పోసాని కృష్ణమురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తన కోసం పని చేసిన ఒక్కొక్కరి రుణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీర్చుకుంటున్నారు. ఇటీవల సినీ నటుడు అలీకి సలహాదారుడి పదవి ఇచ్చి, తన అభిమానాన్ని సీఎం జగన్ చాటుకున్న సంగతి తెలిసిందే.
వైఎస్సార్ సీపీ మద్దతుదారుడిగా పోసాని మొదటి నుంచి బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పోసాని, పలు సందర్భాల్లో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ టీడీపీని, ఎల్లో మీడియాని చాకురేవు పెట్టిన సందర్భాలున్నాయి. ఆ మధ్య పవన్కల్యాణ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తనతో పాటు తన కుటుంబ సభ్యులు జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు, పవన్ అభిమానులు అభ్యంతరకర పోస్టులు, మెసేజ్లు పెడుతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోసాని ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. అనేక సందర్భాల్లో జగన్కు మద్దతుగా పోసాని వినిపించిన గళం, వైసీపీకి రాజకీయంగా లాభం కలిగించిందన్న అభిప్రాయాలున్నాయి. ఏనాడూ పదవులు ఆశించలేదని పోసాని చెప్పడం తెలిసిందే.
ఇటీవల అలీకి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, ఇక తరువాత వంతు పోసానిదే అనే ప్రచారం జరుగుతోంది. అందరూ అనుకున్నట్టే పోసాని సేవల్ని గుర్తు పెట్టుకుని, పిలిచి మరీ పదవి ఇవ్వడం విశేషం.