సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్రెడ్డి హల్చల్ చేస్తున్నారు. ఈయన కమలాపురం ఎమ్మెల్యే కూడా. వరుసగా రెండుసార్లు కమలాపురం నుంచి గెలుపొందారు. రవీంద్రనాథ్రెడ్డి పెద్దగా జనంలో ఉండరు. అలాగే ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. తనకు కావాల్సిన వాటిని చక్కబెట్టుకోవడం తప్ప, ఇతర అంశాలపై ఆయన దృష్టి సారించరని పేరు.
అకస్మాత్తుగా ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రవీంద్రనాథ్రెడ్డి తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహంతో ఊగిపోతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన వీరపునాయునిపల్లె మండలం అలిదెనలో పర్యటించారు. గ్రామస్తుడొకాయన ఏదో ఎమ్మెల్యేని అడిగారు.
ఎమ్మెల్యేకు కోపం వచ్చి చేయి పైకి లేపారు. పొద్దునుగూకులు ఇదే పనా? అడక్క తినడానికి వచ్చామా? అంటూ సదరు గ్రామస్తుడిపై ఎమ్మెల్యే ఆగ్రహంతో చిందులు తొక్కారు. ఎమ్మెల్యేని వైసీపీ నేతలు సముదాయించారు. గ్రామస్తుడిని పోలీసులు, నాయకులు వారించారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగులోకి వచ్చింది. ఏందబ్బా జగన్ మేనమామకు ఇంత కోపం వచ్చిందే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.