బెదురులంక లో… చూడాల్సిన పాయింట్

కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన సినిమా 'బెదురులంక 2012'. గతంలో కలర్ ఫొటో, తెల్లవారితే గురువారం సినిమాలు…

కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన సినిమా 'బెదురులంక 2012'. గతంలో కలర్ ఫొటో, తెల్లవారితే గురువారం సినిమాలు నిర్మించారు బెన్నీ. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకులు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు… 

సినిమా మీద పిచ్చి ప్రేమతో చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి వచ్చాను. ఇది వరుసగా మూడో సినిమా. మంచి సినిమాలు అందించాలన్నదే సంకల్పం.

కథలో 'ఫియర్' (భయం) కూడా ఓ పాత్ర పోషిస్తుంది. అందుకని, 'బెదురులంక 2012' అని పెట్టాం. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది కథ. మేం చెప్పాలనుకున్న కథను 2012 నేపథ్యం అవసరం. కథ వేరుగా ఉంటుంది. 100 పర్సెంట్ ఫోకస్ అంతా 2012 మీద ఉండదు. 

కథలో 'ఎక్స్' ఫ్యాక్టర్ ఉండాలని నేను బలంగా నమ్ముతాను. ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడు… కొత్తదనం ఉండాలని కోరుకుంటా. కథ కుదిరిన తర్వాత మిగతా అంశాలు అన్నీ కుదురుతాయి. ప్రోమో చూసిన తర్వాత 'ఎందుకు ఈ సినిమాకు వెళ్ళాలి' అని ప్రేక్షకులు అనుకోవడానికి ఓ కొత్తదనం కావాలి. నేను అది 'చెక్ లిస్ట్'గా పెట్టుకున్నా. క్లాక్స్ కథ చెప్పినప్పుడు అందులో పాయింట్ నచ్చింది.

తనకు నచ్చినట్టు జీవించే పాత్రలో కార్తికేయ కనిపిస్తారు. అతడ్ని సమాజం ప్రశ్నిస్తూ ఉంటుంది. హీరో ప్రేయసి పాత్రలో నేహా శెట్టి కనిపిస్తారు.సినిమాలో అన్ని పాత్రలకు క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. మన మనసుకు నచ్చినట్లు 100 పర్సెంట్ బయటకు బతకం, చనిపోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. డ్రామా, కామెడీ సినిమాలో హైలెట్ అవుతాయి. సినిమాలో బోలెడు క్యారెక్టర్లు ఉన్నా సరే… కావాలని పెట్టినట్లు ఒక్క క్యారెక్టర్ కూడా ఉండదు. 

ప్రేక్షకుల్లో నేహా శెట్టికి మంచి క్రేజ్ ఉంది. ఆ అమ్మాయితో రూరల్ బ్యాక్‌డ్రాప్ రోల్ చేయిస్తే బావుంటుందని అనిపించింది. ఎటువంటి పాత్రలకు అయినా సరే నేహా శెట్టి సెట్ అవుతారని 'బెదురులంక 2012'తో పేరు తెచ్చుకుంటారు.

దర్శకుడు క్లాక్స్ విజన్ స్క్రీన్ మీదకు రావడానికి ఎక్‌పీరియన్స్డ్ టెక్నీషియన్లు అవసరం అనిపించింది. సంగీత దర్శకుడిగా మణిశర్మ , ఛాయాగ్రాహకుడిగా సాయి ప్రకాష్ … ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆర్టిస్టుల విషయంలో కూడా రాజీ పడలేదు.

ఈ సినిమాకు సిరివెన్నెల ఓ పాట రాయాల్సి వుంది. రాసున్న సమయంలోనే శివైక్యం చెందారు. మాకు ఆ నోట్స్ కూడా మణిశర్మ తెప్పించారు. మిగతా పాటను చైతన్య ప్రసాద్ రాశారు. సిరివెన్నెల తిరిగిరాని లోకాలకు వెళ్లిన తర్వాత 'ఆయన లాస్ట్ సాంగ్ మా సినిమాలో ఉంది' అని కొందరు చెప్పారు. నిజానికి ఆయన చివరి పాట మా సినిమాలో ఉన్నా సరే ఆ విషయం బయటకు చెప్పలేదు. దాన్ని పబ్లిసిటీకి వాడుకోకూడదని భావించాను. 

ట్రైలర్ విడుదల చేయడానికి ముందు రామ్ చరణ్ సినిమా కథ ఏంటని అడిగి తెలుసుకున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఎంటరైన తర్వాత సీన్స్ గురించి చెప్పారు. మణిశర్మ మ్యూజిక్ చాలా బావుందన్నారు. ట్రైలర్ చూడటానికి ముందు కార్తికేయ, నేహా శెట్టి పెయిర్ బావుందని చెప్పారు.