వామపక్షాలకు తమ దాకా వస్తే తప్ప తత్వం బోధపడదని కేరళలో తాజా పరిణామాలు మరోసారి రుజువు చేశాయి. చట్టం, న్యాయం అన్ని చోట్లా ఒకేలా ఉండాలనే కనీస మౌలిక సూత్రాన్ని వామపక్షాలు విస్మరించిన నేపథ్యంలో నేడు కమ్యూనిస్టు పార్టీలు నిలదీతకు గురి అవుతున్నాయి. రాజధాని అమరావతి విషయంలో గవర్నర్ చట్ట ప్రకారం కాకుండా, తాము కోరుకున్నట్టు నడుచుకోవాలనే వితండ వాదనను వామపక్షాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే తమ పాలనలో మాత్రం గవర్నర్ చట్ట ప్రకారం నడుచుకుంటుంటే గగ్గోలు పెట్టడం వామపక్ష పార్టీలకే చెల్లింది. కేరళలో వీసీలంతా తక్షణం రాజీనామా చేయాలని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశించారు. అంతేకాదు, ఇవాళ (సోమవారం) ఉదయం 11.30 గంటలకల్లా రాజీనామా లేఖలు తన టేబుల్పై ఉండాలని గవర్నర్ ట్వీట్ చేయడం ఆ రాష్ట్రంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు.
అక్కడ సీపీఎం నేతృత్వంలో పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల మధ్య వ్యవహారం ఉప్పునిప్పులా ఉండే సంగతి తెలిసిందే. గవర్నర్ల నియామక పూర్తి అధికారాలు గవర్నర్వే. ఎందుకంటే ఆయన చాన్సలర్ కాబట్టి. సెర్చ్ కమిటీ పంపిన మూడు పేర్లలో తగిన విద్యావంతుడని అనిపించిన ప్రొఫెసర్ను వీసీగా గవర్నర్ నియమించే సంప్రదాయం మొదటి నుంచి వుంది.
ఆ అధికారాన్నే కేరళ గవర్నర్ తాజాగా ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం వున్న వీసీలను రాజీనామా చేయాలని ఆయన ఆదేశించడం చట్ట ప్రకారం ఎలాంటి తప్పు కాదు. దీన్ని కేంద్ర ప్రభుత్వ కుట్రగా సీపీఎం నేతలు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గవర్నర్ అన్ని హద్దులు దాటుతున్నారని సీపీఎం నేతలు పేర్కొన్నారు. గవర్నర్ అప్రజాస్వామిక చర్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. వీసీల నియామకం నిర్దేశిత చట్టం ప్రకారం జరుగుతాయని సీపీఎం నేతలు చెప్పడం గమనార్హం.
ఆ నిర్దేశిత చట్ట ప్రకారమే కదా ఇప్పుడు కేరళ గవర్నర్ కొత్త వీసీలను నియమించాలనుకున్నది. కేరళ గవర్నర్పై కేవలం రాజకీయ విమర్శలు తప్ప, ఆయన చేసిన, చేస్తున్న తప్పేంటో సీపీఎం నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఇదే ఏపీలో మాత్రం మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం చెబితే, కమ్యూనిస్టు నేతలు తప్పు పట్టారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని ఇప్పటికీ వారు కోరుతున్నారు.
ఏపీలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తుండడం విమర్శల పాలవుతోంది. తమకు అనుకూలమైన చోట ఒకలా, పాలకులుగా వామపక్ష పార్టీలు ఉన్న చోట మరోలా మాట్లాడ్డం వారికే చెల్లుతుంది. అందుకే ఎక్కడైనా చట్టాన్ని కాపాడాలని కోరితే ఇలా నిలదీతలకు వామపక్షాలు గురికాకుండా వుంటాయి.