మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వలసలు ఊపందుకున్నాయి. నువ్వొకరిని చేర్చుకుంటే, మేము అంతకు రెట్టింపు సంఖ్యలో దెబ్బ తీస్తామని టీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. తెలంగాణ అధికార పార్టీ అన్నంత పని చేస్తోంది. రాజ్యసభ మాజీ సభ్యుడు, బీజేపీ నాయకుడు రాపోలు ఆనందభాస్కర్ త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నారు.
టీఆర్ఎస్ నుంచి బూర రాజయ్య గౌడ్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్గా టీఆర్ఎస్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ తదితరులను చేర్చుకుని గట్టి కౌంటర్ ఇచ్చింది. తాజాగా చేనేత సామాజిక వర్గానికి చెందిన రాపోలు ఆనందభాస్కర్ను చేర్చుకునేందుకు రెడీ అయ్యింది. సీఎం కేసీఆర్తో రాపోలు భేటీ అయ్యారు.
తెలంగాణలో చేనేత రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని రాపోలు అభినందించారు. టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రెండురోజుల్లో టీఆర్ఎస్ కండువాను కేసీఆర్ చేతుల మీదుగా రాపోలు కప్పుకోనున్నారు. ఇప్పటికే అనధికారికంగా టీఆర్ఎస్లో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. 2012లో రాపోలు కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు.
పదవీ కాలం పూర్తికాగానే బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్లో చేరుతుండడం గమనార్హం. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడేకొద్ది ఇంకెన్ని చేరికలుంటాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో ఏ ఒక్కర్నీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం.