కేసీఆర్ కు పరువు పోతుందనే భయం?

రాజకీయ నాయకులకు కొన్ని విషయాల్లో పరువు భయం వెంటాడుతూ ఉంటుంది. కీలక పదవుల్లో ఉన్నవారికి, ప్రజల్లో పాపులర్ అయినవారికి ఈ భయం మరింత ఎక్కువగా ఉంటుంది. కేసీఆర్ కు ఇప్పుడు అలాంటి భయమే పట్టుకుందని…

రాజకీయ నాయకులకు కొన్ని విషయాల్లో పరువు భయం వెంటాడుతూ ఉంటుంది. కీలక పదవుల్లో ఉన్నవారికి, ప్రజల్లో పాపులర్ అయినవారికి ఈ భయం మరింత ఎక్కువగా ఉంటుంది. కేసీఆర్ కు ఇప్పుడు అలాంటి భయమే పట్టుకుందని తెలుస్తోంది. ఆయన్ని వెంటాడుతున్న పరువు భయం మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి. మునుగోడు ఉప ఎన్నికను ఉప ఎన్నిక అనాలో, భీకర యుద్ధం అనాలో, కురుక్షేత్ర యుద్ధం అనాలో అర్ధం కాకుండా ఉంది. తెలంగాణా ప్రజలు ఇలాంటి ఉప ఎన్నికను ఇప్పటివరకు చూసి ఉండరు. ఈ సాధారణ ఎన్నికలకు మించి ఎన్నో రెట్లు ఈ ఒక్క ఉప ఎన్నికకు ఖర్చు చేస్తున్నారు. అన్ని పార్టీలు పూర్తిగా బరితెగించాయని చెప్పుకోవచ్చు.

మునుగోడులో నిబంధనలకు తిలోదాకాలు ఇచ్చేశారు. ఎవరి ఇష్టారాజ్యం వారిది అన్నట్లుగా ఉంది పరిస్థితి. అన్ని పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకులవరకూ ప్రచార రంగంలోకి దిగారు. అధికార పార్టీ నుంచి దాదాపు మొత్తం మంది మంత్రులు రంగంలోకి దిగారు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే అసలు కేసీఆర్ సాధారణంగా ఉపఎన్నికల్లో ప్రచారం చేయరు. తప్పనిసరి అయితే తప్ప ప్రచారం చేయరు. అధికార పార్టీగా ఉండి ఉపఎన్నికల్లో ఓడిపోతే ఓ సమస్య .. సీఎంగా ప్రచారం చేసి మరీ ఓడిపోతే మరో సమస్య. అందుకే కేసీఆర్ దూరంగా ఉంటారని టీఆర్ఎస్ నాయకులు చెబుతారు.

మునుగోడు ఉపఎన్నికల్లోనూ ఫలితం ఏకపక్షంగా ఉండే అవకాశం లేదు. హోరాహోరీగా సాగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో.. మునుగోడులో ప్రచారం చేసి మరీ ఓడిపోతే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అందుకే కేసీఆర్..  ప్రచారానికి దూరంగా ఉండటమే మంచిదని టీఆర్ఎస్‌లో కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మునుగోడులో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ముగింపు వరకూ తరచూ పర్యటించే అవకాశం ఉంది. హరీష్ రావు ఇప్పటికే అక్కడ ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇటీవల ఉపఎన్నికల్లో కేటీఆర్ పెద్దగా ప్రచారం చేయలేదు. దుబ్బాకతో పాటు తాను సిట్టింగ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఉన్న హూజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన ఉపఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు.

మొత్తం బాధ్యతలను హరీష్ రావే చూసుకున్నారు. కానీ మునుగోడు విషయంలో మాత్రం ఆయన రంగంలోకి దిగారు. కేసీఆర్ ప్రచారానికి రావడం లేదని.. అందుకే  కేటీఆర్ రంగంలోకి దిగారన్న అభిప్రాయం టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది. ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన వెంటనే.. కేసీఆర్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీకి వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలోనే వారం రోజుల వరకూ ఉన్నారు. బుధవారమే తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత మునుగోడు ఉపఎన్నికపై సమీక్ష చేశారు కానీ.. తన ప్రచారం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పార్టీ నేతలు రెండు బహిరంగ సభలకు ప్లాన్ చేసుకున్నారు.

ఉన్న పళంగా ఓ బహిరంగసభ నిర్వహించి.. ఆ తర్వాత ప్రచారం చివరి రోజున మరో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఎటూ తేల్చకపోతూండటంతో … ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్నారు. దీంతో మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్ ప్రచారం చేస్తారా లేదా అన్నదానిపై టీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉపఎన్నిక ఖాయమని తెలిసిన తర్వాత కేసీఆర్ ఓ బహిరంగసభలో ప్రసంగించారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత నుంచి ఆయన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చే పనిలో బిజీగా ఉన్నారు. 

ఉపఎన్నికల బాధ్యతను కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారు. అయితే  వీలు కుదిరినప్పుడల్లా తాను సమీక్ష చేస్తూనే ఉన్నారు. సర్వేలు, ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగా పార్టీ నేతలకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయితే మునుగోడు ప్రచారానికి కేసీఆర్ వస్తారా రారా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.