జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను మరోసారి సస్పెండ్ చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. బహుశా ఇది రెండోసారి కాబోలు. ఇది వరకూ కూడా రాపాకను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఆయనను సస్పెండ్ చేశారట. పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను పవన్ కల్యాణ్ ఎలా ట్రీట్ చేస్తున్నారో, ఆయన ఫ్యాన్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారో అందరికి తెలిసిందే. తనను పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం పెట్టారని రాపాక వరప్రసాద్ కూడా ఇది వరకే వాపోయారు. అయితే ఆయనను పట్టించుకునే నాథుడు లేడు జనసేనలో.
ఇక రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓటేశారట రాపాక. తటస్థంగా ఉండాలంటూ ఆయనకు అధిష్టానం చెప్పిందట. అయితే ఆ మేరకు ఎలాంటి విప్ జారీ చేయలేదు. రాపాకకు ఏం చెప్పారో కానీ, ఆయన వైసీపీ అభ్యర్థికి ఓటేశారు. ఈ క్రమంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా జనసేన పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ ఉన్నారు.
అయితే జనసేన అధికారిక ట్విటర్, ఫేస్ బుక్ పేజీల్లో కానీ, పవన్ కల్యాణ్ అధికారిక ట్విటర్ ఖాతాలో కానీ అలాంటి ప్రకటన ఏదీ లేదు. దీన్ని బట్టి రాపాకను సస్పెండ్ చేసింది జనసేన సోషల్ మీడియా కార్యకర్తలే అనుకోవాల్సి వస్తోంది. కడవడంత గుమ్మడి పండు కత్తిపీటకు లోకువ అని.. ఓటు హక్కు కూడా లేని జనసేన అభిమానులు తమ పార్టీ తరఫున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యేను మాత్రంచాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలో మరో సారి ఆయనను సస్పెండ్ చేసేసినట్టుగా ఉన్నారు. అయినా జనసేన నిజంగానే రాపాకను సస్పెండ్ చేయడమే ఆయన కూడా కోరుకునేది కాబోలు.