లాక్ డౌన్ సమయంలో తను చాలా రిలాక్స్ అయినట్టుగా చెప్పింది నటి నిత్యామీనన్. ఇన్నాళ్లూ షూటింగుల కోసం విపరీతంగా తిరగాల్సి వచ్చిందని, లాక్ డౌన్ వేళ షూటింగులు లేకపోవడంతో తను పూర్తిగా ఇంటికే పరిమితం అయినట్టుగా నిత్యామీనన్ వివరించింది. నిత్య ఒక భాషకు పరిమితం అయిన నటి కాదు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ.. ఇలా వివిధ భాషల్లో నటించేస్తూ ఉంది. ఈ క్రమంలో ఆమెకు షూటింగ్ స్పాట్లు కూడా ఎక్కడెక్కడో ఉండవచ్చు. అందుకే నిత్య విపరీతంగా తిరగక తప్పకపోవచ్చు. లాక్ డౌన్ అలాంటి ప్రయాణాలన్నింటికీ బ్రేక్ వేసింది. దీంతో నిత్య బెంగళూరులోని సొంతింటికి పరిమితం అయ్యింది.
ఈమె పేరుకు మలయాళీనే అయినా పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే అని వేరే చెప్పనక్కర్లేదు. ఆ సంగతలా ఉంటే.. నిత్య మల్టీ టాలెంటెడ్ కదా, ఏ రోజుకు అయినా డైరెక్షన్ చేయాలనే యాంబీషన్స్ తో ఉందీమె. ఈ క్రమంలో లాక్ డౌన్ లో అందుకు సంబంధించి కసరత్తు చేసిందట. ఒక స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టిందట నిత్యా. షూటింగుల విరామంలో ఇలా తన పెన్ కు పని కల్పించిందట. అయితే ఇంకా రాయడం పూర్తి కాలేదని నిత్య చెప్పింది. లాక్ డౌన్ సమయంలో రాయడం అయితే మొదలైందని వివరించింది.
ఇక నిత్య సింగర్ కూడా కదా, ఈ మధ్యకాలంలో సినిమాల్లో ఈమె పాటకు పని దొరికినట్టుగా లేదు. ఈ విషయాన్నే నిత్య వద్ద ప్రస్తావించింది ఒక మీడియా సంస్థ. సినిమాల్లో ఇది వరకూ పాడిన తను ఇప్పుడు రెండు ప్రైవేట్ సాంగ్స్ రూపకల్పనకు రెడీ అయ్యిందట. వాటిని ట్యూన్ చేయడం అయ్యిందట. త్వరలోనే వాటిని ప్రేక్షకులకు వినిపిస్తుందట నిత్యామీనన్. ఇక త్వరలోనే షూటింగులు మొదలయ్యేలా ఉన్నాయి వివిధ భాషల్లో. ఈ క్రమంలో తన సినిమాలు నాలుగైదు క్యూలో ఉన్నాయని ఈమె చెప్పింది. ఒక ధనుష్ తమిళ సినిమాలో తను నటించబోతున్నట్టుగా చెప్పింది. అన్ని కుదిరి ఉంటే..ఆగస్టులో ఆ సినిమా ప్రారంభం కావాల్సిందని, అయితే కాస్త లేటు అయినా తను ఆ సినిమాలో నటించబోతున్నట్టుగా నిత్యామీనన్ వివరించింది. తను మాత్రమే ఆ పాత్రను చేయాలంటూ ధనుష్ తన వద్దకు వచ్చాడని నిత్యామీనన్ చెప్పింది.