నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగి…కోరుకున్న సీఎం పదవి దక్కకపోవడంతో బీజేపీలో చేరిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా కరోనా బారిన పడ్డారు. అతనితో పాటు తల్లి మాధవి రాజే సింధియాను కూడా కరోనా మహమ్మారి విడిచిపెట్టలేదు. దీంతో సింధియా అభిమానులు, బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకుంది.
కరోనాతో బాధపడుతున్న తల్లీకుమారుడిని ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. కరోనా లక్షణాలైన జ్వరం, గొంతునొప్పితో జ్యోతిరాదిత్య బాధపడుతుండటంతో వారికి వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో వైద్యులు తల్లీకుమారుడిని అప్రమత్తం చేశారు.
సింధియాలకు నాలుగు రోజులుగా చికిత్స అందుతోంది. జ్యోతిరాదిత్య తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలూ బయటపడలేదు. కానీ ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. చాలా మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని రావడం చూస్తున్నాం.