సరిహద్దులో చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయా? అని ప్రశ్నిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ విషయంలో రక్షణ మంత్రి సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన కామెంట్లపై స్పందిస్తూ, ఆ కామెంట్లు సరే కానీ, ఇంతకీ చైనా బలగాలు ఇండియా భూ భాగాన్ని ఆక్రమించాయా? ఆ అంశం గురించి సమాధానం చెప్పండంటూ ట్వీట్ చేశారు.
లఢక్ తూర్పు భాగంలో చైనా, భారత్ ఆర్మీల మధ్యన వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. అక్కడ చైనా భారీగా ఆర్మీని మొహరించడంతో పాటు, భారీ యుద్ధ వాహనాలను కూడా నిలిపింది. ఈ వివాదంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా తీరును తప్పు పట్టింది. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ స్పందనలు కూడా వ్యక్తం అయ్యాయి. అమెరికా కూడా చైనా తీరును తప్పు పట్టింది. ట్రంప్ మధ్యవర్తిత్వానికి సై అన్నాడు. అయితే ఈ వివాదాన్ని తామే పరిష్కరించుకుంటామని భారత్ స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి అయితే ఇరు దేశాలూ ఉన్నత స్థాయి మిలటరీ వర్గాల మధ్యన చర్చలు జరుగుతున్నట్టుగా చెబుతున్నాయి. ఈ విషయమై భారత్ ప్రకటన చేసింది. మిలటరీ కమాండర్లు ఈ వివాదం గురించి చర్చిస్తున్నారని, శాంతీయుత చర్చలు జరుగుతున్నాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఇంతకీ చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందా? అంటూ రక్షణ శాఖా మంత్రిని ఉద్దేశించి ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం, కేంద్రంలోని అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో!