సూక్ష్మంలోనే మోక్షం పెట్టుకుని…అనవసర రాద్ధాంతాలకు, వివాదాలకు మూడు రాజధానుల ఏర్పాటు దారి తీసిందని చెప్పొచ్చు. ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు ఉత్తరాఖండ్ రెండో రాజధానిగా చమోలీ జిల్లాలోని గైర్సెయిన్ పట్టణాన్ని ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణిమౌర్య ఆమోదించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్కుమార్ సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలాంటి వాదవివాదాలకు తావు లేకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెండో రాజధాని ఏర్పాటు చేసింది.
ఉత్తరాఖండ్ పరిపాలనా రాజధానిగా డెహ్రాడూన్ నగరం కొనసాగుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో రాజధాని విషయమై బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. గైర్సెయిన్ను రెండో రాజధానిగా (వేసవి) మారుస్తామని మార్చి 4న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు. ఆ హామీ అమలుకు మూడేళ్లు పట్టింది.
కాగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన వేలాది మంది ప్రజలకు గైర్సెయిన్కు దక్కిన రాజధాని హోదాను అంకితం ఇస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఆ నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలో కూడా ఎలాంటి వివాదానికి ఆస్కారం లేకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఉత్తరాఖండ్లో మాదిరిగా జగన్ సర్కార్ కూడా గవర్నర్ ఆమోదం, అనంతరం సీఎస్ నుంచి నోటిఫికేషన్ ఇప్పంచి ఉంటే ఓ పనై పోయేది.
కానీ జగన్ అసెంబ్లీలో బిల్లులు పెట్టడం, వాటిని ఆమోదించడం, ఆ తర్వాత మండలికి అవి వెళ్లడం, అక్కడ నానా రభస మధ్య పెండింగ్లో పడిన విషయం తెలిసిందే. చివరికి మూడు రాజధానుల పుణ్యమా అని మండలి రద్దుకు దారి తీసింది. అయినప్పటికీ మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందో చెప్పలేని అయోమయ స్థితి. మండలి రద్దు వ్యవహారాన్ని కేంద్రం కోర్టులోకి తోసేయడం ద్వారా…చేజేతులారా మూడు రాజధానుల వ్యవహారాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టినట్టైంది.
మూడు రాజధానుల ఏర్పాటు విషయమై జగన్ సర్కార్ సరైన కసరత్తు చేయలేదనేందుకు ఆ పార్టీ వ్యవహరించిన తీరే నిదర్శనం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రలోని పరిపాలనా రాజధాని, శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆలోచించడం గొప్ప నిర్ణయమే. కానీ అమలు విషయానికి వచ్చేసరికి సరైన మార్గం అనుసరించలేదు. పదుల సంఖ్యలో సలహాదారులున్నప్పటికీ….మూడు రాజధానులకు మాత్రం సరైన దారి దొరకలేదు. మరెప్పటికి దొరుకుతుందో కూడా చెప్పలేని అయోమయ స్థితి.