ప్రత్యర్థులపై బీజేపీ నాయకుడు బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. బండి సంజయ్ శనివారం చొప్పదండిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఘాటు విమర్శలు చేశారు.
ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా కేసీఆర్ చెప్పుకుంటున్నారని సంచలన కామెంట్ చేశారు. చొప్పదండిలో బీజేపీ అభ్యర్థి బొడిగె శోభను గెలిపించకపోతే మీరంతా ఓవైసీ తమ్ముళ్లు అవుతారని సొంత పార్టీ శ్రేణులపై సెటైర్ విసిరారు.
అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్కు అల్లుళ్లు అవుతారని తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి సంజయ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే…. ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్, కవిత, హరీష్రావు, సంతోష్ కుమార్ ముఖ్యమంత్రులు కావాలని పోటీ పడతారని విమర్శించారు. కాంగ్రెస్లో కూడా ఇదే పరిస్థితి వుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే వాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే తాను సీఎం అవుతానని చెప్పనని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని తీసుకుని బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని బండి సంజయ్ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థి సీఎం కావడం తథ్యమన్నారు. ఇదే విషయాన్ని తమ పార్టీ అధిష్టానం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్కు ప్రజల్లో ఇమేజ్ లేదన్నారు. బీఆర్ఎస్ను ఓడించే ఏకైక పార్టీ బీజేపీనే అని ఆయన ధీమాగా చెప్పారు.