ఒకవైపు ఎక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా నిలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్. కరోనా కట్టడికి వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడమే మార్గమని అంతర్జాతీయంగా వివిధ పరిశోధన సంస్థలు, దేశాలు కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయి. అనుమానితులకు కరోనా పరీక్షలు చేయడం ద్వారా.. వారికి కరోనా వైరస్ సోకిందా, లేదా అనే విషయం వీలైనంత త్వరగా నిర్ధారణ చేయడం ద్వారా.. కరోనా నియంత్రణకు అవకాశం ఉంటుందని అధ్యయన సంస్థలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఏపీ చాలా మెరుగైన స్థితిలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బయటపడుతున్న కేసుల సంఖ్య కూడా బాగానే నమోదు అయ్యింది. అయితే.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కొత్త కేసుల స్థాయి కన్నా ఎక్కువగా ఉండటం ఏపీకి సానుకూల అంశంగా మారుతూ ఉంది. ఏపీలో ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నా, డిశ్చార్జి అయ్యే వారి సంఖ్య కూడా అందుకు తగ్గట్టుగా ఉంది.
ఇప్పటి వరకూ ఏపీలో 887 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని అధికారిక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ప్రస్తుతం కరోనా నివారణ చికిత్స పొందుతూ ఉన్న వారి సంఖ్య 999గా ఉందని సమాచారం. కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకూ కాస్త తగ్గుతూ ఉంది. ఇదే సమయంలో డిశ్చార్జిల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఏపీలో మరి కొన్నాళ్లకు కరోనా కేసుల సంఖ్య చాలా వరకూ తగ్గిపోయే అవకాశాలున్నాయి.