బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితుల్లో.. బర్త్ డే పార్టీలు చేసుకోవాలని వీళ్లకు ఎలా అనిపించిందో, గుమికూడదండ్రా.. అని ప్రభుత్వాలు బతిమాలుతూ ఉంటే, ఎందుకు చెబుతున్నారో కూడా అర్థం చేసుకోని వీళ్లను ఏమనాలో కానీ.. సరూర్ నగర్ పరిధిలో ఒక బర్త్ డే పార్టీ వల్ల ఏకంగా 45 మందికి కరోనా సోకిందనే వార్త ఆశ్చర్యం కలిగించకమానదు.
ఒకవైపు లాక్ డౌన్ కొనసాగుతూ ఉంది తెలంగాణలో, అయినా ఇలాంటి బర్త్ డే పార్టీని ఎలా హోస్టు చేశారో! ప్రతీదీ ప్రభుత్వం వచ్చి ఆపలేదు, ప్రజల్లో కూడా కాస్తంత ఇంగితజ్ఞానం ఉండాలి, పరిస్థితులు ఏమిటీ.. అనే విషయాన్ని కాస్త అయినా పట్టించుకోవాలి. అయితే కొంతమంది మూర్ఖులకు మాత్రం పరిస్థితులు అర్థం కావు, ఏం జరుగుతున్నదీ అస్సలు పట్టదు. తాము చేయాలనుకున్నది చేసేస్తూ ఉంటారు. నిలువునా నిండిన నిర్లక్ష్యం ఫలితం ఇది.
సరూర్ నగర్ లో ఒక షాప్ ఓనర్ ఇటీవలే భారీ ఎత్తున తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ చేశాడట. తన బర్త్ డే కూడా కాదు..తన ఫ్రెండ్ అయిన మరో షాప్ ఓనర్ బర్త్ డే పార్టీని నిర్వహించాడట! అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో! అప్పటికే సదరు షాప్ ఓనర్ కరోనా పాజిటివ్ అయ్యాడు. తన షాపులో పని చేసే ఒక వ్యక్తి నుంచి ఆ షాపు ఓనర్ కు కరోనా వైరస్ సోకింది. అతడి నుంచి అతడి ఇంట్లో వాళ్లకూ కరోనా సోకింది. వీళ్లు తరచూ తమ ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ వచ్చారు. వీరి వల్ల సదరు ఫ్రెండ్ ఇంట్లోని వారికీ కరోనా సోకింది!
ఇక వీళ్లు ఇచ్చిన బర్త్ పార్టీకి హాజరైన వారికీ కరోనా ముప్పు తప్పలేదని తెలుస్తోంది. వీళ్లందరితోనూ కలిపి ఏకంగా 45 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారించారు వైద్యాధికారులు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారే 25 మంది ఉన్నారట! ఇక మిగిలిన వాళ్లు వేర్వేరు కుటుంబాల వాళ్లు, వీళ్లంతా సరూర్ నగర్ ప్రాంతంలోనే నివసించే వారని తెలుస్తోంది. దీంతో వీళ్లు తచ్ఛాడని పరిసరాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణిస్తూ ఉన్నారు. అక్కడ ఎంతమందికి కరోనా సోకిందో అనే భయాందోళనలు నెలకొంటున్నాయి! కొంచెమైన ఆలోచన ఉండాలి, ఇలాంటి పరిస్థితుల్లో బర్త్ డే పార్టీలు చేసుకుని, ఖుషీలు చేసుకోవాల్సిన అవసరం ఎంతో.. ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తామూ మనుషులమని చెప్పుకోంటే కాదు, కాస్త ఇంగితముండాలి.