మహారాష్ట్ర ప్రభుత్వంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ సంచలన అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో కంగనా తన విమర్శలకు పదును పెట్టారు.
గతంలో మహారాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన కారణంగా తనపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అప్పట్లో తనను బెదిరించారని, ఎన్నెన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు.
ముంబై పట్ల తన విధేయతను ప్రశ్నించినప్పుడు తాను నిశ్శబ్దంగా రోదించానన్నారు. అనుమతి లేకుండా ఇల్లు నిర్మించానని బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు కూల్చి వేశారని వాపోయారు. అప్పట్లో పలు పార్టీల నాయకులు పండగ చేసుకున్నారన్నారు. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన ఆస్తిని కాపాడుకున్నట్టు కంగనా చెప్పుకొచ్చారు.
మహారాష్ట్ర హోం మంత్రిపై ఆరోపణల నేపథ్యంలో దేశభక్తులెవరో, అవినీతిపరులెవరో బయటపడిందన్నారు. రానున్న రోజుల్లో వీరి అవినీతి కథలు మరింతగా బయటికొస్తాయన్నారు. తాను నిజమైన దేశ భక్తురాలినని, వారిలా అవినీతిపరురాలిని మాత్రం కాదని ఆమె స్పష్టం చేశారు.