టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజాకోర్టులో ఉరిశిక్ష వేశారని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ చంద్రబాబు కాదు…స్టే బాబు అని వ్యంగ్యంగా అన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబునాయుడులాగా అడ్డమైనోళ్ల కాళ్లు పట్టుకోవాల్సిన, తలకాయ వంచాల్సిన అవసరం జగన్కు లేదని అన్నారు. అందితే కాళ్లు, లేకపోతే జుట్టు పట్టుకోవడం, వెన్నుపోట్లు పొడవడం , నమ్మించి మోసం చేయడం …ఇదంతా చంద్రబాబు రక్తంలో ఉందన్నారు. అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కే స్వభావం తండ్రీకొడుకులదని నాని ఫైర్ అయ్యారు.
స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తండ్రీకొడుకులకు దమ్ము ధైర్యం ఉంటే మోడీని ప్రశ్నించాలని నాని సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని అనుకుంటే ఢిల్లీ వచ్చి కాలర్ పట్టుకుంటామని మోడీని హెచ్చరించాలని హితవు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు , రాష్ట్రానికి సంబంధం లేదని తెలిసి కూడా రాజకీయాలు చేస్తున్నారన్నారు.
విశాఖలో కార్మికుడి ఆత్మహత్యను కూడా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ట్రాప్లో పడొద్దని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఆయన విన్నవించారు. శవం దొరగ్గానే రాజకీయం చేయాలని ఎదురు చూసే రాబంధులు తండ్రీకొడుకులని మండిపడ్డారు.
చంద్రబాబు జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఒక్కటే అని నాని విరుచుకుపడ్డారు. ఆరు నెలలకో సారి జైలు నుంచి పెరోల్ మీద బయటికి వచ్చే నిందితుల్లా చంద్రబాబు, ఆయన తనయుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వచ్చి రెండు రోజులు రాజకీయాలు చేసి వెళుతున్నారని ధ్వజమెత్తారు. అత్యధిక స్టేలు తెచ్చుకున్న నేతగా చంద్రబాబు రికార్డు సృష్టించారన్నారు. న్యాయస్థానాల్లో శిక్ష పడకపోతే, ప్రజాకోర్టులో శిక్షలు పడేలా చేస్తామన్నారు.