ఇండియాలో ఇప్పటి వరకూ ఐదు లక్షల మందికి పైగా కరోనా టెస్టులను నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల వారీగా ఈ పరీక్షలు జరిగాయి. ఐదు లక్షల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో దాదాపు 22 వేల మందికి ఆ వైరస్ సోకిందని తేలింది. వీరిలో దాదాపు 700 మందికి పైగా మరణించారు. దాదాపు 4 వేలకు మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించింది అనుమానితులకే. విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి, కరోనా హాట్ స్పాట్ గా నిలిచిన తబ్లిగీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారికి.. ఇలాంటి వారితో సన్నిహితంగా మెలిగిన వారికి, కుటుంబీకులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంఖ్య దాదాపు 5 లక్షలకు చేరింది.
ఇక ఇదే సమయంలో వివిధ దేశాల్లో 5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యే సమయానికి తేలిన మొత్తం కేసుల సంఖ్యతో పోలిస్తే ఇండియా చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉండటం గమనార్హం. భారత్ లో 5 లక్షల మందికి పరీక్షలు చేస్తే దాదాపు 22 వేల మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
అదే అమెరికాలో 5 లక్షల పరీక్షలు పూర్తయ్యే సమయానికి దాదాపు 80 వేల మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మార్చి 26 నాటి నంబర్ అది. ఇటలీలో మార్చి 31నాటికి 5 లక్షల పరీక్షలను చేయగా, వారిలో ఏకంగా లక్ష మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. యూకేలో ఏప్రిల్ 20 నాటికి ఐదు లక్షల పరీక్షలు జరగ్గా వారిలో ఏకంగా లక్షా ఇరవై వేల మంది కరోనా పాజిటివ్ గా తేలారు! టర్కీలో ఏప్రిల్ 16 నాటికి ఐదు లక్షల పరీక్షలు జరగ్గా వారిలో 80 వేల మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని నిపుణులు చెబుతూ ఉన్నారు.
కరోనా అత్యంత ప్రభావిత దేశాలు అవి, వాటితో పోలిస్తే.. ఇండియాలో రికార్డు అయిన కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువే అనేది ఊరట. అయితే ఇంతటితో సమస్య సమసిపోవడం లేదు. రోజు వారీగా ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏ రోజుకు ఆ రోజు వందల సంఖ్యల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. అది కూడా ఉన్నంతలో మెరుగైన స్థితిలో లాక్ డౌన్ అమలవుతూ ఉంది. అయినా కేసుల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది. ఇది మాత్రం ఆందోళన కరమైన అంశం.