తన మూలాలను మరిచిపోని వాడే నిజమైన మనిషి. ఏ స్థాయికి ఎదిగినా…జన్మనిచ్చిన తల్లిదండ్రులను, జన్మ స్థలాన్ని, గురువులను, స్నేహితులను, బంధువులను మరిచిపోని వాడిని…వాళ్లంతా కూడా ఎప్పుడూ తమ గుండెల్లో భద్రంగా దాచుకుంటారు. బర్నింగ్ స్టార్గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు వెండి తెర, బుల్లి తెరలపై అలరిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికీ తన స్వస్థలంలోనే ఉంటూ షూటింగ్ రోజుల్లో మాత్రం వెళ్లి వస్తున్న అరుదైన, ఆదర్శనీయమైన నటుడు సంపూర్ణేష్. బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొని…జైలు లాంటి ఆ ఖరీదైన హౌస్లో ఊపిరాడక ఏడ్చి, పెడబొబ్బలు పెట్టి..ఎట్టకేలకు బంధవిముక్తుడైన విషయం తెలిసిందే.
ప్రస్తుత లాక్డౌన్ కూడా ఒక రకమైన బిగ్బాస్ హౌస్ లాంటిదే. అయితే సంపూర్ణేష్బాబు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే అతనికి పల్లె వాతావరణం తప్ప, మరెక్కడా ఇమడలేడు. తాను లాక్డౌన్ ఖాళీ సమయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో సోషల్ మీడియాలో సంపూ వివరించాడు.
వృత్తి రీత్యా అతను కంశాలి. ప్రవృత్తి రీత్యా మాత్రమే నటుడు. లాక్డౌన్ వేళలో ఇంట్లో ఉంటూ కంశాలి వృత్తిలో ఆనందంగా గడుపుతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. మెట్టెలు, గజ్జెలు స్వయంగా ఆయనే తయారు చేశాడు. ‘బి ది రియల్ మ్యాన్’ చాలెంజ్ను ఆ విధంగా విజయవంతంగా పూర్తి చేశాడు.
మెట్టెలు, గజ్జల తయారీకి సంబంధించి వీడియోను సంపూర్ణేష్ బాబు ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ కామెంట్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. అంతేకాదు, జీవితాన్ని చీకూచింతా లేకుండా గడిపేందుకు కావాల్సినంత తత్వజ్ఞానాన్ని ఆయన అందించాడు. ఇంతకూ ఆయన ఏమన్నాడంటే…
‘రాజు పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు.. నీ వెనక రావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు, గుర్తు చేసుకుంటున్న సమయం ఇది. మా ఆవిడ కోసం, పిల్లల కోసం నా పాత “కంశాలి”వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను’ అని సంపూ పేర్కొన్నాడు.
సంపూ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే…మట్టిలో మాణిక్యం. అలాంటి సంపూర్ణమైన మనిషి కావడం వల్లే వజ్రం లాంటి మాటలు ఆయన ట్వీట్ నుంచి వచ్చాయి. సంపూ కేవలం మాటల మనిషే కాదు. సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ సంపూ రూ. లక్ష విరాళం అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు.