అప్పన్న భూముల మాయం…అశోక్ మెడకేనా… ?

ఉత్తరాంధ్రా జిల్లా రాజకీయాలు మరో మారు కాక పుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజుని టార్గెట్ చేస్తూ వైసీపీ సర్కార్ అడుగులు వేస్తోందా అన్న…

ఉత్తరాంధ్రా జిల్లా రాజకీయాలు మరో మారు కాక పుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజుని టార్గెట్ చేస్తూ వైసీపీ సర్కార్ అడుగులు వేస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది.

సింహాచలం భూముల విషయంలో ఇప్పటికే తీగ లాగిన ప్రభుత్వం గతంలో సింహాచలం ఈవోగా పనిచేసిన కె రామచంద్రమోహన్ ని ఇప్పటికే దేవాదాయ శాఖ ప్రభుత్వానికి సరెండర్ చేసింది. ఆయన హయాంలో చట్టవిరుద్ధంగా ఏకంగా 22ఏ జాబితా నుంచి 748 ఎకరాల భూములను తొలగించారని అభియోగాలు ఉన్నాయి.

ఆ టైమ్ లో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన భూముల విషయంలో కూడా అవకతవకలు జరిగాని ప్రభుత్వం గుర్తించింది. దాని విషయంలోనూ కె రామచంద్రమోహన్ ఉన్నారని అంటోంది. మొత్తానికి ప్రాధమిక విచారణలో రామచంద్రమోహన్ హయాంలోనే భూములు మాయం అయ్యారని గుర్తించారు.

ఇపుడు రామచంద్రమోహన్ మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి అసలు విషయాలను రాబట్టడానికి చూస్తున్నారు. ఈ విచారణ అనంతరం బయటపడే ఏ విషయం అయినా అశోక్ టార్గెట్ గానే ఉంటుంది అంటున్నారు. 

మొత్తానికి మాన్సాస్ చైర్మన్ గా అశోక్ ఉన్న టైమ్ లోనే పెద్ద ఎత్తున భూముల అవకతవకలు జరిగాయన్నదే ఇపుడు ప్రభుత్వ వాదనగా ఉంది. దీని ఫలితాలు, పర్యవశానాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.