ఎక్కడో విసిరేసినట్లుగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోని సంతకవిటి మండలం పొదలి గ్రామంలో పుట్టిన ఆడబిడ్డ ఇపుడు విజయవాడ వంటి మెగా సిటీకి ప్రధమ పౌరురాలు అయింది.
శ్రీకాకుళం జిల్లాలోని బెవర నారాయణరావు, యశోదా క్రిష్ణవేణి దంపతుల రెండవ బిడ్డగా ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన రాయన భాగ్యలక్ష్మి పేరుకు తగినట్లే మహా భాగ్యమే అందుకున్నారు.
ఆమె రెండు దశాబ్దాల క్రితం వివాహం చేసుకుని అత్తిల్లు అయిన విజయవాడ చేరారు. ఆమె మామగారిది రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం కావడంతో భాగ్యలక్ష్మి కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.
ఇక తాజాగా జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె వైసీపీ తరఫున పోటీ చేసి కార్పొరెటర్ గా గెలిచారు. వెనకబడిన వర్గానికి చెందిన మహిళగా ఉన్న ఆమె సేవలను గుర్తించి జగన్ ఆమెను ఏకంగా విజయవాడ మేయర్ ని చేశారు. దీంతో తాను ఎప్పటికీ జగన్ రుణం తీర్చుకోలేనని భాగ్యలక్ష్మి అంటున్నారు.
మరో వైపు ఆమె పుట్టిన జిల్లా శ్రీకాకుళంలో కూడా సంబరాలు జరుగుతున్నాయి. మా జిల్లా ఆడపడుచు విజయవాడ ప్రధమ పౌరురాలుగా అయిందంటూ సిక్కోలు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బీసీల పక్షపాతిగా ఉన్న జగన్ వల్లనే సాధ్యమైందని కూడా శ్రీకాకుళం జిల్లా నగరాల సంఘం ప్రతినిధులు అంటున్నారు.