మైదుకూరు మున్సిపాలిటీ ఎట్టకేలకు వైసీపీ హస్తగతమైనట్టే కనిపిస్తోంది. మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డులుండగా, టీడీపీ 12 వార్డుల్లో, వైసీపీ 11 వార్డుల్లో , జనసేన ఒక చోట గెలుపొందాయి. దీంతో ఏ పార్టీకి కూడా మెజార్టీ దక్కని పరిస్థితి.
ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుంటే వైసీపీ బలం 13కు పెరిగింది. టీడీపీ, జనసేన కలిస్తే సంఖ్యా బలం 13 అవుతుందని, దీంతో ఇద్దరికి సమాన ఓట్లు దక్కినట్టు అవుతుందనే అంచనాలు వేయసాగారు.
ఈ నేపథ్యంలో నేడు మైదుకూరు మున్సిపల్ నూతన పాలకమండలి కొలువు తీరేందుకు సిద్ధమైంది. దీంతో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఆరో వార్డు సభ్యురాలు మహబూబ్బీతో పాటు జనసేన సభ్యుడు బాబు గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీ బలం 11కి పడిపోయింది. మరోవైపు అధికార పార్టీ వైసీపీ 13 మంది సభ్యుల బలంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు మార్గం సుగుమమైంది.
ఈ నేపథ్యంలో మైదుకూరు మున్సిపాలిటీపై ఉత్కంఠకు తెరపడినట్టేనని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా ఆరోవార్డు సభ్యురాలిని కిడ్నాప్ చేశారంటూ ఆమె తనయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఏది ఏమైనా మైదుకూరులో అనూహ్యంగా ఇద్దరు సభ్యుల గైర్హాజరుతో చైర్మన్ పీఠం వైసీపీ వశమైందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.