ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతుంటాయి. భయం అంటే ఏంటో ఆమెకు తెలియదు. ఎంతటి వారిపైనైనా తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు ఖుష్బూ చెబుతారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖుష్బూ బరిలో నిలిచారు.
ఈ సందర్భంగా తన అభిప్రాయాలను ఆమె మీడియాతో పంచుకున్నారు. తాను తమిళనాడుకు వచ్చి 35 ఏళ్లు అయ్యిందని తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలిచానన్నారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ప్రచారానికి మంచి స్పందన కనిపిస్తోందన్నారు. తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తనకు అన్నిటికంటే ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఏమాత్రం సహించే ప్రశ్నే లేదన్నారు. తనకు ప్రచార యావ ఎంత మాత్రం లేదని ఖుష్బూ స్పష్టం చేశారు. పత్రికల మొదటి పేజీల్లో ఫొటోలు చూసుకోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని ఆమె స్పష్టం చేశారు.
రాజకీయాల్లో నిబద్ధత చాలా అవసరమన్నారు. సినిమాల్లో సక్సెస్ అయ్యేవారంతా రాజకీయాల్లో కూడా అదే విధంగా రాణిస్తారని చెప్పలేమన్నారు. అభిమానులను ఓటు బ్యాంకుగా ఎప్పుడూ చూడకూడదని ఖుష్బూ తేల్చి చెప్పారు. నాయకులై ముందుకు నడిపిస్తారని విశ్వాసం కలిగించినప్పుడే సినీ తారలకు జనం ఓట్లు వేస్తారని ఆమె చెప్పారు.
తానేమీ పనిగట్టుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని ఆమె చెప్పుకొచ్చారు. తాను కేవలం అభిప్రాయాలు మాత్రమే చెబుతానన్నారు. అయితే కొంత మంది వైఖరి వివాదాస్పదంగా ఉంటుందని, అలాంటి వారిపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుంటాయని ఖుష్బూ తెలిపారు.