మనం ఇంత వరకూ వుయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలు మాత్రమే విన్నాం. అన్యాయానికి గురైన అభాగ్యులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు తదితరులు రోడ్డెక్కి తమకు న్యాయం చేయాలని నలుదిక్కులూ మార్మోగోలా, పాలకులు తమ నిర్ణయాన్ని మార్చుకునేలా గొంతెత్తి అరవడం చూశాం, చూస్తున్నాం.
వుయ్ వాంట్ జస్టిస్ అనే నినాదం ఎంత స్ఫూర్తినిస్తుందో ఢిల్లీ కేంద్రంగా రైతుల ఉద్యమం సాగిస్తున్న ఉద్యమం ప్రతి ఒక్కరి అనుభవంలోకి వచ్చింది. అయితే మన పెద్దాయన వుయ్ వాంట్ స్టే అని నినదించడానికి సిద్ధమవుతున్నారు. స్టే అంటే రాజకీయ నేతల్లో ఎవరు గుర్తుకొ స్తారో తెలుగు రాజకీయాలతో పరిచయం ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ 40 ఏళ్ల ఇండస్ట్రీనే చంద్రబాబు నాయుడు.
జస్టిస్ అంటే ఆయన దృష్టిలో స్టే తెచ్చుకోవడం. ఇప్పుడాయన జస్టిస్ పొందేందుకు సిద్ధమయ్యారు. రాజధానిలో దళితులకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారంలో ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు.
అసలు విచారణకే హాజరు కాకుండా స్టే తెచ్చుకునేందుకు నిన్నటి నుంచి చంద్రబాబు న్యాయనిపుణులతో ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. గతంలో కూడా అనేక కేసుల్లో కనీసం విచారణ ఎదుర్కోకుండానే చంద్రబాబు పదుల సంఖ్యలో స్టేలు తెచ్చుకున్న ఘనత చంద్రబాబు సొంతం.
తాజాగా సీఐడీ నోటీసులు అందుకున్న చంద్రబాబు తాను విచారణకు హాజరు కాకుండా స్టే ఇవ్వాలని బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నారని టీడీపీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయినా చంద్రబాబు స్టే కోసం కోర్టుకెళ్లకపోతే వార్త అవుతుందే గానీ, వెళితే ప్రత్యేకత ఏముందనే సెటైర్లు కూడా పేలుతున్నాయి. అంతే, అంతేగా మరి!