తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎంతో ముందుగానే గత ఏడాది డిసెంబర్లో వ్యూహకర్త రాబిన్శర్మను ఆ ఆధ్మాత్మిక నగరానికి పంపింది. అయితే గత కొంత కాలంగా వ్యూహ కర్త అలికిడే లేదు. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రాబిన్శర్మ అనే వ్యూహకర్తను నియమించుకున్నారు.
గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్(పీకే) బృందంలో రాబిన్ శర్మ కీలకపాత్ర పోషించాడు. ఆ టీం నుంచి బయటికొచ్చి ‘షోటైమ్ కన్సల్టింగ్’ పేరుతో రాబిన్ ప్రత్యేకంగా సంస్థ పెట్టుకున్నాడు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ అంతర్గతంగా పని చేస్తున్నట్టు అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది.
స్థానిక సంస్థల్లో ఘోర పరాజయం తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ డీలాపడ్డాయి. ఎన్నికలంటే ప్రతిపక్ష పార్టీలకు ఫోబియా పట్టుకుంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ….అసలే పంచాయతీ, మున్సిపల్స్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో మూలుగుతున్న ప్రతిపక్ష పార్టీలపై తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వచ్చి పడింది.
ఈ ఎన్నికలను ఎదుర్కోవడం ముఖ్యంగా టీడీపీకి పెద్ద టాస్క్గా మిగిలింది. ఎందుకంటే పంచాయతీ, పురపాలక ఎన్నికల ఫలితాలు ..రానున్న లోక్సభ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో తీవ్ర నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్ని తిరిగి లోక్సభ ఎన్నికకు సమాయత్తం చేయడం అంత సులభం కాదని చెప్పక తప్పదు.
ఈ కష్టకాలంలో టీడీపీ వ్యూహకర్త ఎలా గైడ్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. అన్నిటికి మించి అసలు తిరుపతిలో టీడీపీ వ్యూహకర్త రాబిన్శర్మ ఉన్నారా? అనేది ఓ పెద్ద ప్రశ్న. ఉంటే రావయ్యా త్వరగా, పరువు నిలపయ్యా రాబిన్శర్మా!