టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేశ్ మాట తీరులో స్పష్టమైన మార్పు వచ్చింది. మరీ ముఖ్యంగా లోకేశ్ ట్వీట్లు నేలబారుగా ఉంటాయనే విమర్శ ఉండేది. ఇప్పుడు ట్వీట్లే కాదు, ఆయన వాడుతున్న భాష వీధి కొళాయిల దగ్గర మాట్లాడుకునేలా ఉందన్న విమర్శ లేకపోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పదేపదే ‘ఏం పీక్కుంటారో పీక్కోండి’ అనడం వింటున్నాం. చంద్రబాబును కాసేపు పక్కన పెడదాం.
చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ విషయానికి వస్తే …ఆయన వైసీపీ మంత్రికి ఏకలవ్య శిష్యుడిలా తయారయ్యారు. ఇంకా చెప్పాలంటే మంత్రి కొడాలి నానిని చూసి లోకేశ్ వాతలు పెట్టుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలిని బూతుల మంత్రిగా అభివర్ణిస్తున్న వాళ్లు చేస్తున్న పనేంటో ఒక్కసారి ఆలోచించాలి.
కొడాలి నాని ప్రత్యర్థులపై మాటల దాడికి ఓ ప్రత్యేకత ఉంది. కొడాలి నాని ప్రయోగించే భాషను వ్యతిరేకించే వాళ్లు ఎంత మంది ఉన్నారో, అంతే స్థాయిలో అభిమానించే వాళ్లు కూడా ఉన్నారని గ్రహించాలి. అలాగని అభిమానించే వాళ్లంతా ఆయన ప్రయోగిస్తున్న భాషకు ఓటు వేస్తున్నట్టు కాదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే …చంద్రబాబు, లోకేశ్లపై విమర్శలు చేసేందుకు అలాంటి భాషే కరెక్ట్ అని చెప్పడం అలాంటి ఉద్దేశం.
రాజకీయంగా కొడాలి నానికి ఆయన బూతు భాషే క్రేజ్ తీసుకొచ్చిందని గ్రహించిన లోకేశ్…. ప్రత్యర్థి బాటలోనే నడిచేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా లోకేశ్ మాట తీరు మారింది. ఇదేమైనా వైసీపీ వాళ్ల అమ్మ మొగుని సొత్తా లాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చాలా సులభంగా లోకేశ్ మాట్లాడగలుగుతున్నారు. నిన్నటికి నిన్న తన తండ్రికి సీఐడీ నోటీసులు అందించిన సందర్భంలో లోకేశ్ చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశమైంది.
సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గడ్డం మీద నెరిసిన వెంట్రుక కూడా పీకలేరని లోకేశ్ ట్వీట్లో ఘాటు కామెంట్ కూడా కొడాలి స్ఫూర్తితో చేసిందే. ముల్లును ముల్లుతోనే తీయాలనే కాన్సెప్ట్తో లోకేశ్ సరికొత్త పంథాను ఎంచుకున్నట్టుగా అర్థమవుతోంది.
కాకపోతే కొడాలి గడ్డం పెంచాడు, లోకేశ్ కనీసం మీసాలు కూడా పెంచలేదు. కానీ భాష మాత్రం సేమ్ టు సేమ్. బూతుపురాణంలో లోకేశ్ రాటుదేలుతున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. కొడాలి బాట పట్టిన లోకేశ్ ఏ తీరానికి చేరుతాడో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.