రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ అధికా రులు కేసు నమోదు విచారణకు రావాలనడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసు విషయంలో నోటీస్ చేయాల్సిన ముఖ్యమైన అంశం ఒకటుంది.
బాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు, విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మొదలుకుని టీడీపీ చిన్నాచితకా నేతలంతా మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెడుతున్నారు.
అయితే ఒక్క టీడీపీ నేతలు తప్ప ఇతర పార్టీలు , నాయకులు “ఇది అన్యాయం, కక్ష సాధింపు” అని మాటమాత్రం కూడా సానుభూతి తెలపక పోవడాన్ని జాగ్రత్తగా గమనించాలి. అంటే రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు వ్యాపారం చేశారని మిగిలిన పార్టీలు నమ్ముతున్నాయనేందుకు ఇదే నిదర్శనం.
కనీసం టీడీపీ మిత్రపక్షమైన సీపీఐ కూడా బాబుకు నోటీసులు ఇవ్వడంపై మౌనం పాటించడం దేనికి సంకేతం? గతంలో ఇదే సీపీఐ, సీపీఎంలు అమరావతి విషయంలో బాబు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఘాటైన విమర్శలు చేశాయి.
ఇప్పుడు అసైన్డ్ భూములపై కేసు కావడంతో సీపీఐ నోరు తెరిచేందుకు జంకుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు కోసం దళితుల కడుపు కొట్టడాన్ని కూడా సమర్థిస్తారా? అనే ప్రశ్నలు ఎదురవుతాయనే భయంతో సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ అతి కష్టమ్మీద నోరు కట్టేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే బీజేపీ, జనసేన పార్టీలు సైతం ఏం మాట్లాడకుండా తాజా పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. అసలే ఇటీవల జరిగిన అవాంఛనీయ ఘటనతో టీడీపీతో పాటు అమరావతి ఆందోళనకారులపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం బీజేపీకి సంతోషాన్ని ఇచ్చేదే.
జనసేనాని పవన్కల్యాణ్ గతంలో జగన్ కంటే తీవ్రంగా రాజధాని అక్రమాలపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయంగా ఒంటరి అయ్యార నేందుకు తాజా పరిణామాలే నిదర్శనం. బాబుపై నోటీసులకు సంబంధించి స్పందించాలని టీడీపీ కాకుండా ఇతర పార్టీల నాయకులను మీడియా ప్రతినిధులు కోరగా – “ష్…గప్చుప్” అంటున్నట్టు తెలుస్తోంది.