అమరావతి రాజధానిపై టీడీపీ శిఖండి రాజకీయాలకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిలో దళితులు, గిరిజనుల అసైన్డ్ భూములను అప్పనంగా లాక్కోవడమే కాకుండా, ఇప్పుడు వాళ్ల చేత్తోనే వారి కంటిని పొడుస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని దళితులే ఖండిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చేందుకు ఎల్లో మీడియా, టీడీపీ తీవ్రంగా ప్రయాస పడుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో చంద్రబాబుపై అట్రాసిటీ కేసు ఎలా పెడతారంటూ అమరావతి దళిత జేఏసీ నేత మార్టిన్ ప్రశ్నిస్తున్నారని తెరపైకి తేవడం గమనార్హం.
ఎస్సీ, ఎస్టీ కాని వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అట్రాసిటీ కేసు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆళ్ల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తా? అని కూడా నిలదీయడం గమనార్హం. ఎఫ్ఐఆర్లో భూములు అమ్మిన, కొన్న వ్యక్తుల పేర్లు లేవని ఆయన గుర్తు చేయడం విశేషం. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసులు పెడుతున్నారని ఆయన అనడం కొసమెరుపు.
బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డిపై ఏబీఎన్ చానల్లో దాడి జరిగినప్పుడే ఇదే విధంగా దళిత కార్డ్ను ప్రయోగించడాన్ని చూశాం. ఇప్పుడు దళితులు, గిరిజనుల అసైన్డ్ భూములను చంద్రబాబు సామాజికవర్గంతో పాటు టీడీపీ చెందిన మరికొందరు ఇతర సామాజిక వర్గ నాయకులు అప్పనంగా కొల్లగొట్టారని జగన్ ప్రభుత్వం గుర్తించి చర్యలకు ఉపక్రమించింది.
ఇందులో భాగంగా సీఆర్డీఏ పరిధిలో దళితులు, గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములకు సంబంధించి 444 ఎకరాలను 30 మంది టీడీపీ నేతలు, రియల్టర్లు వశం చేసుకున్నారని కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే.
దళితులు, గిరిజనుల భూములను కొల్లగొట్టడం న్యాయమని ఏ ఒక్క దళితుడైనా చెబుతారా? కానీ తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చెయ్యగల విద్యలో ఆరితేరిన ఎల్లో గ్యాంగ్, తమకు మద్దతుగా బాధిత సామాజిక వర్గం నుంచే ప్రకటన ఇప్పించడంలో ఆశ్చర్యపోనవసరం లేదు.
చౌకధరకే భూములు కొన్న చంద్రబాబు సామాజిక వర్గం వారితో ఇలాంటి ప్రకటన ఇప్పించాలనే ఆలోచన ఎందుకు రాలేదో మరి! అధికారం, ఆస్తులకు మాత్రం బాబు సామాజిక వర్గీయులు, వత్తాసు పలకడానికి మాత్రం దళితులా? అబ్బా ఏం సామాజిక న్యాయం చంద్రబాబూ!