మహేష్ కు బై – పవన్ కు హాయ్ ?

మహేష్ కు లైన్ చెప్పా, ఓకె అయింది. అంటూ ఆ మధ్య డైరక్టర్ అనిల్ రావిపూడి మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పుకువచ్చారు. కానీ ఇప్పట్లో మహేష్ డేట్ లు దొరికేలా కనిపించడం లేదు. సర్కారువారిపాట,…

మహేష్ కు లైన్ చెప్పా, ఓకె అయింది. అంటూ ఆ మధ్య డైరక్టర్ అనిల్ రావిపూడి మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పుకువచ్చారు. కానీ ఇప్పట్లో మహేష్ డేట్ లు దొరికేలా కనిపించడం లేదు. సర్కారువారిపాట, త్రివిక్రమ్ సినిమా పూర్తి కావాలి. అంటే 2022 సమ్మర్ తరువాత సంగతి. కానీ మహేష్ మనసు అప్పటికి ఎలా వుంటుందో తెలియదు. ఎవరు రంగంలోకి దిగుతారో తెలియదు.

అయితే అనిల్ రావిపూడి పరిస్థితిని గమనించిన నిర్మాత దిల్ రాజు, ఆయనను వేరే ప్రాజెక్టుకు మళ్లించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడిని పవన్ కళ్యాణ్ కు ముడివేయాలన్నది దిల్ రాజు ప్లాన్ గా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు ఫినిష్ చేయాల్సి వుంది. అయ్యప్పన్ రీమేక్, హరిహరవీరమల్లు, హరీష్ శంకర్ సినిమా పూర్తి కావడానికి కనీసం 2022 డిసెంబర్ వచ్చేస్తుంది. 

ఆ తరువాత సినిమా తన నిర్మాణంలో అనిల్ రావిపూడితో చేయించాలన్నది దిల్ రాజు ఆలోచన. ఎఫ్ 3 తరువాత బాలకృష్ణతో సినిమా చేసి వచ్చే అనిల్ రావిపూడిని పవన్ సినిమాకు ముడేయాలన్నది ఆయన ప్రయత్నం. 

పవన్ కు దిల్ రాజుకు మరొ సినిమా చేయడంలో ఎటువంటి ముందు వెనుకలు లేవు. కానీ దానికి డైరక్టర్ కావాలి. అనిల్ రావిపూడి అయితే తనకు ఓకె అని పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరో కొద్ది రోజుల్లో అనిల్ రావిపూడి ని పవన్ తో కలిపేందుకు దిల్ రాజు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన సోమవారం నాడే అమెరికా నుంచి తిరిగివచ్చారు. ఇప్పుడు ఆయన తక్షణ కార్యక్రమం ఇదే అని తెలుస్తోంది. ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఇక మహేష్-అనిల్ రావిపూడి సినిమా వుండనట్లే. ఎందుకంటే మహేష్ అయితే రాజమౌళితో లేదా మరో సినిమాచేసి ఆ తరువాత రాజమౌళితో ఫిక్స్ అయిపోతారు. 

అంతా బాగానే వుంది. తనతో సినిమా చేయాలనుకుంటున్న అనిల్ రావిపూడిని అట్నుంచి అటే పవన్ దగ్గరకు దిల్ రాజు తీసుకువెళ్తున్నారని తెలిసి మహేష్ ఎలా ఫీలవుతారో మరి?