వావ్‌…జ‌గ‌న్‌తో భేటీపై కేటీఆర్ ఆత్మీయ ట్వీట్‌

దావోస్‌లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ క‌లుసుకున్నారు. న‌వ్వులు చిందిస్తూ ఫొటోకు దిగారు. ప్ర‌స్తుతం వీళ్లిద్ద‌రి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. జ‌గ‌న్‌తో భేటీపై కేటీఆర్ ఆత్మీయ ట్వీట్…

దావోస్‌లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ క‌లుసుకున్నారు. న‌వ్వులు చిందిస్తూ ఫొటోకు దిగారు. ప్ర‌స్తుతం వీళ్లిద్ద‌రి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. జ‌గ‌న్‌తో భేటీపై కేటీఆర్ ఆత్మీయ ట్వీట్ చేయ‌డం విశేషం. 

సీఎం జ‌గ‌న్‌, కేటీఆర్ క‌ల‌యిక‌కు ప్రాధాన్యం వుంది. ఇటీవ‌ల ఏపీ ప‌రిస్థితుల‌పై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, ఆ త‌ర్వాత వెన‌క్కి తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

ఏపీపై కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కు మంత్రులు, వైసీపీ నేత‌లు గ‌ట్టి కౌంట‌ర్లు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దావోస్‌లో జ‌రుగు తున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సుకు జ‌గ‌న్‌, కేటీఆర్ వేర్వేరుగా వెళ్లారు. 

త‌మ త‌మ రాష్ట్రాల‌కు ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చేందుకు సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప‌లు సంస్థ‌ల‌తో ఇరు రాష్ట్రాల ప్ర‌తినిధులు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు.

ఇద్ద‌రు నేత‌లు ద‌గ్గ‌ర‌గా నిలిచి, న‌వ్వుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. “నా సోద‌రుడు, ఏపీ సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశం గొప్ప‌గా జ‌రిగింది” అంటూ ట్వీట్‌కు ఫొటోల‌ను కూడా షేర్ చేయ‌డం విశేషం. 

అలాగే కేటీఆర్‌, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కూడా దావోస్‌లో క‌లుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోష‌ల్ మీడియాలో మిథున్‌రెడ్డి షేర్ చేశారు.